దమ్ముంటే ప్రభుత్వాన్ని పడగొట్టు: జగన్కు మంత్రి డిఎల్ ప్రతిసవాల్
జగన్ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ త్వరలో అన్ని విషయాలు బయట పడతాయన్నారు. జగన్ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడితే ఆ ప్రభుత్వాలు దోపిడీ ప్రభుత్వాలు అవుతాయని అన్నారు.తనను రాజీనామా చేయాలని అడుగుతున్న ఎమ్మెల్యేలు ఎక్కడికి రావాలని అడుగుతున్నారని, స్పీకరు కార్యాలయానికి రావాలన్నారు. రాజీనామాలు ఎక్కడ ఇస్తారో తెలియదా అని ప్రశ్నించారు.
అందరం కలిసి రాజీనామాలు చేద్దాం రండి అని ఆయన ఎమ్మెల్యేలకు సవాల్ చేశారు. కిరణ్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. రెండు పడవల మీద ప్రయాణం ఆ ఎమ్మెల్యేలకు సరికాదన్నారు. అయినా వారిని ఏమీ అనడం లేదని, వారిని జగన్ బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు. దయాదాక్షిణ్యాలు అన్న జగన్ తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తన దమ్ము నిరూపించుకుంటే బలం నిరూపించుకొని మా దమ్ము నిరూపిస్తామన్నారు. కడప జిల్లాలోని ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ గొప్పదా, జగన్ పెట్టబోయే పార్టీ గొప్పదా తెలుస్తుందన్నారు.
జగన్ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలను పార్టీ అధిష్టానం పరిశీలిస్తుందని, పార్టీ క్రమశిక్షణా సంఘం వారిపైన చర్యల విషయం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కృష్ణా తీర్పులో రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట వాస్తవమే అని అయితే ఆ పాపం దివంగత ముఖ్యమంత్రి వైయస్దే ఆ పాపం అన్నారు. తమకు మిగిలు జలాలు అవసరం లేదని వైయస్ లేఖ రాశారని చెప్పారు. వైయస్ మరణం తర్వాత రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందంటే అందుకు కారణం తెలంగాణ ఉద్యమం, ఆర్థిక ఇబ్బందులని ఆయన చెప్పారు.
దానికి కారణం కూడా ఎవరో అందరికీ తెలుసునని చెప్పారు. కృష్ణా నీటీ కోసం జలదీక్ష చేపట్టిన జగన్కు కృష్ణా నది ఎక్కడ పుట్టిందో తెలుసా, రాష్ట్ర పరిస్థితులపై తనకు ఏం తెలుసునని ప్రశ్నించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ దయవల్ల జగన్ ఈ స్థాయికి వచ్చాడని అది ఆయనకు గుర్తుకు లేనట్టుగా ఉందన్నారు. పన్నెండేళ్ల క్రితం వైయస్ జగన్ ఆదాయమెంత ఇప్పటి ఆదాయమెంత అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.