చిరంజీవిపై సోనియా గాంధీ మెగా ఆశలు, అందుకే ప్రాముఖ్యత
చిరంజీవి భారత జాతీయ కాంగ్రెస్కు పెద్ద ఎసెట్గా ఆయన అభివర్ణించారు. చిరంజీవికి పదవుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా మొయిలీ ఆయనను వీటన్నింటికీ అతీతమైన నేతగానే చూస్తున్నట్లు మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఓట్లు, చిరంజీవి ఇమేజ్, జనాకర్షణశక్తి ప్రస్తుతం పార్టీకి ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కునేందుకు ఉపయోగపడతాయనే నమ్మకం కాంగ్రెస్ అధిష్ఠానంలో నెలకొంది.
ప్రజారాజ్యం పార్టీ విలీనం వల్ల తక్షణంగా కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం సుస్థిరత సాధిస్తుందని. ఆ పార్టీకి చెందిన 18 మందిలో 16 మంది ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాబోతున్నారు. రాయలసీమకు చెందిన శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి వైయస్ జగన్ వెంట నడిచేందుకు సిద్ధపడ్డారు. భవిష్యత్తులో ప్రచారపరంగా చిరంజీవి కాంగ్రెస్ తురుపుముక్క అవుతారనే భావం నేతల్లో నెలకొంది. కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చిరంజీవి విస్తృతంగా ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలంటున్నాయి.
చిరంజీవిని ఆరు నెలల తరువాత కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటారని గట్టిగా చెబుతున్నారు. ప్రస్తుతం కిరణ్కుమార్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్థిరపడి జనంలోకెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ గందరగోళం నెలకొనకుండా చిరును కొంతకాలం ఢిల్లీకి పరిమితం చేయవచ్చని భావిస్తున్నారు. 2012లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. దానికి ఆరునెలల ముందు చిరంజీవిని క్యాబినెట్లోకి తీసుకుని ఆపైన రాజ్యసభ సభ్యుణ్ణి చేస్తారని చెబుతున్నారు. అయితే చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లోనే కాంగ్రెస్ తరపున కీలకపాత్ర పోషిస్తారనే మరో వాదన కూడా బలంగానే ఉంది.
ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్కు త్వరలోనే మరో కీలక బాధ్యతను అప్పగించి ఆయన స్థానే చిరంజీవిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం కూడా పార్టీలో జోరుగా సాగుతోంది. ఆ విధంగా ఆయనను పూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంచుతారనేది ఈ వర్గాల వాదన. విలీనమైన వెంటనే పదవులు తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావన వల్ల కొంత వ్యవధి తీసుకుంటారని సమాచారం.
రాష్ట్రంలోను ప్రజారాజ్యం నుంచి వచ్చిన వారికి నలుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం ఖాయమని భావిస్తున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 17నుంచి మార్చి 30 వరకు జరుగుతాయి. ఈ సమావేశాలు ముగిసిన తరువాతే వీరికి పదవులు దక్కే అవకాశముంది. ఏప్రిల్ లేదా మే నెలల్లో మంత్రివర్గంలో ఇతర మార్పులు కూడా చోటు చేసుకునే వీలుంది. ఈ సమయంలో ప్రజారాజ్యం నుంచి వచ్చిన శాసనసభ్యులకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నాయి. మరికొంత మందికి నామినేటెడ్ పదవులు ఇస్తారని అంటున్నారు.