రాజీనామా చేయని టి - ఎమ్మెల్యేలు 19 మందే
కాగా, కాంగ్రెసు శానససభ్యులు మణెమ్మ (ముషిరాబాద్), మర్రి శశిధర్ రెడ్డి (సనత్నగర్), రేగా కాంతారావు (పినపాక, ఖమ్మం జిల్లా), మిత్రసేన్ (అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా), శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్క (మథిర, ఖమ్మం జిల్లా) రాజీనామాలు చేయలేదు. వీరితో పాటు హైదరాబాదులోని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు మజ్లీస్ శానససభ్యులు రాజీనామాలు చేయలేదు. వీరు రాజీనామా చేసే అవకాశాలు లేవు. మజ్లీస్ శాసనసభ్యులు కూడా రాజీనామాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభా పక్ష నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ (కూకట్పల్లి, హైదరాబాద్) రాజీనామా చేయలేదు. ఆయన రాజీనామా చేసే అవకాశాలు లేవు. కాంగ్రెసుకు చెందిన మల్కాజిగిరి శాసనసభ్యుడు ఆకుల రాజేందర్, సంగారెడ్డి శానససభ్యుడు జగ్గా రెడ్డి కూడా రాజీనామా చేయలేదు. తాను రాజీనామా చేయబోనని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.
అలాగే, సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి (మిర్యాలగుడా, నల్లగొండ జిల్లా) కూడా రాజీనామా చేయలేదు. సిపిఎం రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కావడంతో ఆయన రాజీనామా చేయకపోవచ్చు. అయితే, ఆయనపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. జూలకంటి రంగారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆందోళనకారులు మిర్యాలగుడాలోని సిపిఎం కార్యాలయంపై దాడి చేశారు. రాజీనామా చేసిన తెలంగాణ శాసనసభ్యులు సంఖ్య 97కు చేరుకుంది.