త్రివేది రైల్వే బడ్జెట్ వైపు చూస్తున్న ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి అన్యాయం జరగలేదని తాను అనడం లేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్యాయం జరిగితే నిరసన వ్యక్తం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. తమతో తెలుగుదేశం సభ్యులు కలిసి రావాలని ఆయన అన్నారు. కాంగ్రెసు సభ్యులు మైకుల వద్ద నిరసన తెలియజేస్తారు గానీ పార్లమెంటులో వ్యక్తం చేయరని నామా నాగేశ్వర రావు ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.
రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం లభించేలా చూడడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మినహా మిగతా పార్లమెంటు సభ్యులంతా హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు తమ తమ ప్రాధమ్యాలను వివరించారు. రైల్వే సహాయ మంత్రి మునియప్ప అప్పుడు వారికి హామీలు ఇచ్చారు. వరంగల్ జిల్లా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనే డిమాండ్ కూడా ఉంది.