భారత్ మాకు శత్రువు కాదు: అగ్ని5 క్షిపణిపై చైనా
భారత్ తమకు శత్రుదేశం కాదని చైనా వ్యాఖ్యానించింది. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలున్నాయని చెప్పింది. భారత్ క్షిపణి ప్రయోగం వార్తలు అందాయని, ఇరు దేశాల మంది గట్టి సంబంధాలున్నాయని, ఇటీవలి బ్రిక్స్ సమావేశంలో భారత్ ఇరు దేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, ద్వైపాక్షిక వ్యూహాత్మక సహకార భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవాలని చెప్పిందని చైనా గుర్తు చేసింది.
ప్రపంచంలోని ఈ ప్రాంతంలో ఆయుధాల పరుగు పందేన్ని అగ్ని 5 ప్రయోగం మరో దశకు తీసుకుని వెళ్తుందని భారతదేశంలో దౌత్యకార్యాలయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అగ్ని 5 ప్రయోగంపై మీడియా వార్తలు రెచ్చగొట్టే పద్ధతిలో ఉన్నాయని అభిప్రాయపడింది. అగ్నిరేంజ్లోకి భారత్ ప్రవేశించడం పట్ల అభ్యంతరాలున్నాయా అని అడిగితే రెండు కూడా శక్తివంతమైన దేశాలుగా ముందుకు వస్తున్నాయని, తాము ప్రత్యర్థులం కాదని, తాము సహకార భాగస్వాములమని, పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని బీజింగ్లో ల్యూ అన్నారు.
ప్రపంచ స్థిరత్వాన్ని ఈ ప్రయోగం ప్రభావితం చేస్తుందా అని అడిగితే ఆసియా దేశాలు శాంతికి, స్థిరత్వానికి ప్రాముఖ్యం ఇస్తాయని అన్నారు. అయితే, ప్రభుత్వం నడిపే గ్లోబల్ టైమ్స్ మాత్రం ప్రయోగంపై తీవ్రంగా ప్రతిస్పందించింది. చైనా అణుశక్తి అత్యంత బలమైంది, నమ్మకమైందని, దాన్ని భారత్ అందుకోలేదని వ్యాఖ్యానించింది.
భారత్ తన శక్తిని ఎక్కువగా ఊహించుకోవద్దని, చైనాతో వివాదం విషయంలో ఆ క్షిపణి ఏమైనా చేస్తుందనే విశ్వాసం కూడదని ఆ పత్రిక రాసింది.