కలెక్టర్ కిడ్నాప్: విడుదలకు చర్యలన్న రమణ్ సింగ్
తన భర్త అస్తమాకు ఉందన్న ఆమె మీనన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మీనన్ను మావోయిస్టులు తులసీ హిల్స్కు తరలించారని తెలుస్తోంది. తులసీ హిల్స్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దుల్లో ఉంది. దీంతో పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో పాటు అడవులను జల్లెడ పడుతున్నాయి. అటు సుకమా ఎస్పీ ఇతర ఉన్నత అధికారులు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.
కాగా ఛత్తీస్గఢ్లోని సుకమా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ను మావోయిస్టులు శనివారం అపహరించుకుపోయారు. అడ్డొచ్చిన ఇద్దరు అంగరక్షకులపై కాల్పులు జరిపారు. దీంతో ఒక గన్మెన్ ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నక్సల్ ప్రభావిత మజ్హిపార గ్రామానికి కలెక్టర్ వెళ్లారు.
నక్సలిజం వైపు ప్రజలు ఆకర్షితులు కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సూరజ్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సమయంలోనే 20 మంది మావోయిస్టు తిరుగుబాటుదారులు హఠాత్తుగా వచ్చి అంగరక్షకులపై కాల్పులు జరిపి కలెక్టర్ను కిడ్నాప్ చేశారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దళాలు మజ్హిపార గ్రామ సమీప అడవుల్లో గాలింపు మొదలెట్టాయి. కాగా, సుకమా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ క్షేమంగా విడుదలకు తగిన చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రమణ్సింగ్ ప్రకటించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తామని కేంద్ర హోంమంత్రి చిదంబరం రమణ్సింగ్కు హామీ ఇచ్చారు. అవసరమైతే రాష్ట్రానికి అదనపు కేంద్ర భద్రతా దళాలను పంపిస్తామని చెప్పారు. సుకమా జిల్లా ఇటీవలే కొత్తగా అవతరించింది. జిల్లాకి తొలి కలెక్టర్గా నియమితులైన అలెక్స్పాల్కి మంచి గుర్తింపు ఉంది. తమిళనాడుకి చెందిన ఈయన 2006 బ్యాచ్ ఐఏస్ అధికారి. కాగా, కలెక్టర్ విడుదల కోసం కేంద్రం అన్ని చర్యలు చేపట్టాలని అతని బంధువులు వేడుకుంటున్నారు.