కంచి శంకరాచార్యపై కోర్టులో నటి రంజిత వాంగ్మూలం
స్వామి నిత్యానందతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ నటి రంజిత కంచి మఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతిపై కోర్టులో సోమవారం ఫిర్యాదు చేసింది. జయేంద్ర సరస్వతిపై ఆమె క్రిమినల్ డెఫమేషన్ కంప్లైట్ చేసింది. అయితే, ఆమె కోర్టుకు ఆలస్యంగా రావడంతో దానికి సంబంధించిన లాంఛనాలను శుక్రవారం పూర్తి చేయలేకపోయింది.
సోమవారంనాడు ఆమె సకాలంలో వచ్చి అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ విజి రవింద్రన్ ముందు తన పిర్యాదును దాఖలు చేసింది. తనకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రంజిత శ్రీజయేంద్ర సరస్వతిపై ఆ ఫిర్యాదు చేసింది. తనకు బలమైన విశ్వాసం ఉందని, అందుకే తాను మతపరమైన సమావేశాలకు, ఇష్టాగోష్టులకు హాజరయ్యానని ఆమె తెలిపింది. తమిళనాడు, కర్ణాటకలో చేసిన ప్రవచనాలకు తాను నిత్యానంద శిష్యురాలిగా మారినట్లు ఆమె చెప్పింది.
శ్రీ జయేంద్ర సరస్వతి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిత్యానంద స్వామికి, తనకు మధ్య సంబంధాలు అంటగడుతూ మాట్లాడారని రంజిత చెప్పింది. కావాలనే కంచి మఠాధిపతి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె అన్నది. తనపై చేసిన చెడు వ్యాఖ్యలకు తాను మస్తాపానికి, వేదనకు గురయ్యానని ఆమె చెప్పింది.