ప్రకృతి పిలిచినా..: పిఎస్లో కెఏ పాల్కు విచిత్రానుభవం
రాత్రి అడ్డాకుల పోలీసు స్టేషన్లోనే కెఏ పాల్ను ఉంచారు. తెల్లవారగానే ప్రకృతి పిలుపు అందింది. కానీ స్టేషన్ ఆవరణలోని టాయ్లెట్లో అప్పటికే ఎవరో ఉన్నారు. దీంతో లోపలున్న వారు బయటకు వచ్చేదాకా పాల్ వేచి చూడాల్సి వచ్చింది. పొట్టపై అరచేత్తో నిమురుకుంటూ అక్కడే అటు ఇటు పచార్లు చేశారు. ఓ పావుగంట పాటు అతను అక్కడే క్షణమొక యుగంలా గడిపాడు. ఆ తర్వాత లోపలున్న వ్యక్తి బయటకు రావడంతో అతని సంఘర్షణ తగ్గింది.
కాగా డేవిడ్ రాజు హత్య కేసులో కెఏ పాల్ను పోలీసులు తమ కస్టడీలోకి విచారణ నిమిత్తం తీసుకున్న విషయం తెలిసిందే. నోరు తెరిస్తే బిల్ క్లింటన్ స్థాయి వ్యక్తుల గురించి మాట్లాడే.. అమెరికా అధ్యక్షుడు, తాను మాత్రమే సొంత అవసరాలకు బోయింగ్-747 విమానం వాడతామని చెప్పే పాల్ అడ్డాకుల పోలీసు స్టేషన్లో విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్నారు.
తళతళలాడే సూటూ బూటూ, టీ షర్టులు వేసుకునే ఆయన... ఆరు బయట స్నానం తర్వాత, ముందు రోజు తొడుక్కున దుస్తులనే మళ్లీ వేసుకున్నారు. పట్టు పాన్పులు, ఎసి గదుల సంగతి పక్కన పెడితే... అడ్డాకుల స్టేషన్లో ఉన్న ఒక కుర్చీ, బెంచి పైనే పాల్ విశ్రాంతి తీసుకున్నారు.