రేపే పోలింగ్: ఓటరు దేవుడు ఎవరిని కరుణించెనో?
తెలుగుదేశం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయడంతో అనర్హత వేటు పడటం, రాజీనామా చేయడం వంటి కారణాల వల్ల ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. కాంగ్రెసు పార్టీని వీడి సొంతకుంపటి పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వీరు అండగా నిలుచున్నారు. ప్రధానంగా ఈ కారణంతోనే ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే.
రెండుసార్లు వరుసగా ప్రతిపక్షంలో కూర్చున్న తెలుగుదేశం పార్టీ అస్తిత్వం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భవితవ్యం ఈ ఉప ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంది. పార్టీ పరంగా కాంగ్రెసుకు పెద్దగా నష్టమేమీ ఉండదనే చెప్పవచ్చు. అది జాతీయ పార్టీ కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెసుకు ఎదురు దెబ్బ తగిలినా క్రమంగా భవిష్యత్తులో నిలదొక్కుకునే అవకాశముంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలైన టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే ఈ ఎన్నికలు క్లిష్టంగా మారాయి.
కాంగ్రెసు జాతీయ పార్టీ అయినప్పటికీ ఉప ఎన్నికలను మాత్రం అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. గెలుపు కోసం శాయశక్తులా కృషి చేసింది. టిడిపి తరఫున ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున వైయస్ జగన్, వైయస్ విజయమ్మ, షర్మిలలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ కాంగ్రెసు తరపున మాత్రం అతిరథ మహారథులు ప్రచారం చేశారు.
ప్రజల్లో మాస్ ఇమేజ్ కలిగిన రాజ్యసభ సభ్యుడు చిరంజీవి నుండి మొదలుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి వరకు అందరూ ప్రచారంలో కనిపించారు. తెలంగాణలో బిజెపి, టిఆర్ఎస్ మధ్య హోరాహోరీగా ఉంది. ఈ ఉప ఎన్నికలు చిరంజీవి, చంద్రబాబు, జగన్ వంటి వ్యక్తుల పరువుతో పాటు పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. మరి ఓటర్లు ఎవరి పరువు నిలబెడతారో.. ఏ పార్టీకి పట్టం గడతారో చూడాలి.
మరోవైపు ఉప ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేస్తోంది. ఉప ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలలో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఓటింగ్ కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. బ్యాలెట్ బాక్సులను ఆయా కేంద్రాలకు తరలిస్తున్నారు. ఉప ఎన్నికలలో ఎలాంటి ఫిర్యాదులు చేయాలనుకున్నా ఫిర్యాదులు చేయవచ్చునని భన్వర్ లాల్ చెప్పారు.