బాపూజీకి అసెంబ్లీ నివాళి: గో బ్యాక్... జెపికి చుక్కెదురు
పెద్ద దిక్కు కోల్పోయాం.. కోదండరామ్
తెలంగాణ పెద్ద దిక్కును కోల్పోయిందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే బాపూజీకి అసలైన నివాళీ అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం చర్చిస్తోందని, ఇలాంటి కీలక సమయంలో ఆయన లేకపోవడం బాధాకరమని, జలదృశ్యంలో ఆయన అంతిమ సంస్కరణలు జరిగేలా ప్రభుత్వం చూడాలన్నారు. బాపూజీ మన మధ్య లేకపోవడం తీరని లోటని తెరాస అభిప్రాయపడింది. తెలంగాణ కోసం మంత్రిపదవినే వదులుకున్న గొప్ప వ్యక్తి బాపూజీ అని కొనియాడారు.
బాపూజీ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమం, 1969 తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా పని చేశారని, తెలంగాణ ప్రజల ఆర్థిక, రాజకీయ ప్రగతి కోసం అహర్నిషలు కృషి చేసిన వ్యక్తి అన్నారు. తుది శ్వాస వరకు తెలంగాణ కోసం కృషి చేశారని, ఆయన మరణం తీరని లోటు అన్నారు.
బాపూజీ జీవితాశయం నెరవేరుతున్న సమయంలో ఆయన మృతి చెందడం బాధాకరమని ఎంపీ మధుయాష్కీ అన్నారు. కాగా బాపూజీ పార్థివ దేహానికి గద్దర్, జయప్రకాశ్ నారాయణ తదితరులు నివాళులు అర్పించారు. జెపి జెపి పార్థివ దేహాన్ని సందర్శించన సమయంలో పలువురు తెలంగాణవాదులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ద్రోహుల్లారా రావొద్దు, జెపి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాగా రేపు ఉదయం పదకొండు గంటలకు బాపూజీ అంత్యక్రియలు జరుగుతాయి.