మీవల్లే మేం ఇక్కడ: కిరణ్ కుమార్, కృష్ణలో 'తెలంగాణ'
యువకిరణాల పేరుతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తోందని ఓ పార్లమెంటు సభ్యుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు లేఖ రాశారన్నారు. ఇప్పటికి లక్షా ఇరవై ఐదు వేల ఉద్యోగాలను నోటిఫై చేసినట్లు చెప్పారు. అనంతరం గన్నవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కృష్ణా జిల్లా ప్రజలు తెలివైన వారని, ఇక్కడ ఇచ్చే తీర్పు ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందన్నారు.
వచ్చే సాధారణ ఎన్నికల నాటికి కాంగ్రెసును జిల్లాలో బలోపేతం చేయాలని, గత ఎన్నికల్లో ఆరు సీట్లు గెలిచామని, ఇటీవల రెండు గెలిచామని కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం పదహారుకు పదహారు కాంగ్రెసు గెలుచుకునేలా కృషి చేయాలన్నారు. అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, అయితే రాష్ట్రంలో నెలకొన్న తెలంగాణ వంటి పలు సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం త్వరలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇందిర బాట కార్యక్రమంలో భాగంగా తాను మూడు రోజుల పాటు జిల్లా ప్రజలతోనే కలిసి తింటానని, నిద్రిస్తానని తెలిపారు. కృష్ణా జలాల కొరత వల్లే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. ఈ ఏడాది విద్యుత్ సబ్సిడీ రూ.5,500 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. విద్యుత్ సమస్య అయినా మరే సమస్య అయినా తనకు అబద్దాలు చెప్పడం తెలియదని, వాస్తవ పరిస్థితిని చెప్తానని, అయితే సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు. సమస్యను రాజకీయం చేయడం సులభమన్నారు.
ఇక నుండి ఇసుకను కూడా నిత్యావసర వస్తువుగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. అవినీతికి అవకాశం లేకుండా రాజీవ్ యువకిరణాల కింద ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. ఏడాదిలో 61వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మహిళలకు రూ.13వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం ఇస్తోందన్నారు. పార్టీ కార్యకర్తలు కష్టపడితేనే తాము ఈ స్థానంలో ఉన్నామని, కార్యకర్తలను విస్మరిస్తే పతనం ప్రారంభమవుతుందన్నారు.
కార్యకర్తలను ప్రోత్సహించే బాధ్యత పార్టీది, నేతలదే అన్నారు. త్వరలో 35వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. కొన్ని ఇబ్బందుల వల్ల కార్పోరేషన్, పార్టీ పోస్టులను భర్తీ చేయలేక పోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కోటి నలభై లక్షల మంది మహిళలు గ్రూపుల్లో ఉన్నారని, 42వేల కోట్ల రూపాయల రుణాలు వ్యవసాయం కోసం రైతులకు ఇస్తున్నామని, ఏడు జిల్లాల్లో ధాన్యం కొంటున్నామని చెప్పారు.