అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి, అనుమానాలు
హర్ష మృతితో నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించింది. పోలీసులు హర్ష కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు విల్మెంట్ హార్బర్లో హర్ష మృతదేహం లభ్యమైంది. తమ కుమారుడి మృతికి హర్ష తల్లిదండ్రులు ధనలక్ష్మి, ప్రసాద్ కన్నీరు మున్నీరవుతున్నారు.
అదృశ్యమైన హర్ష కోసం అమెరికా తెలుగు సంఘం (ఆటా) వివిధ మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. మిత్రులు, వివిధ సంస్థలు, ఏజెన్సీలు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. విశ్వవిద్యాలయంలోని అతని మిత్రులు హర్షను చివరిసారిగా గత శుక్రవారం రాత్రి చూశారు.
అతని మిత్రులు, సహ విద్యార్థులు సరిగా సహకరించలేదని, మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదని ఆటా ప్రతినిధులు అంటున్నారు. ఈ మేరకు ఓ విజ్ఞప్తి పత్రం రాసి అందరికీ పంపించారు. ధనలక్ష్మి, ప్రసాద్ మద్దుల పేరు మీద తమ 18 ఏళ్ల కుమారుడి గాలింపు కోసం ఓ పిటిషన్ కూడా పెట్టారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి హర్ష కనిపించ లేదని అన్నారు. తమకు సహకరించాలని వారు వైట్హౌస్కు విజ్ఞప్తి చేసుకున్నారు.