అడుగుపెడితే భూకంపమే: జగన్పార్టీ, టిడిపిపై కెసిఆర్
టిడిపి, వైయస్సార్ కాంగ్రెసులు సమైక్యవాద పార్టీలు అని, అవి తెలంగాణలో అడుగుపెడితే భూకంపం ఖాయమన్నారు. నవంబర్ 1వ తేదిని విద్రోహ దినంగా పాటించాలని, అందరూ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం తెలంగాణ ఇస్తే సంబురాలు చేసుకుంటామని లేదంటే సమరం తప్పదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు.
తెలంగాణ సాధించే వరకు ఎత్తిన జెండాను దించే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ సాధనే తన జీవిత లక్ష్యం అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ వ్యతిరేక పార్టీలు గల్లంతు కావడం ఖాయమన్నారు. ప్రజలు సమైక్యవాద పార్టీలను తిప్పి కొడతారన్నారు. వచ్చే నెల 15న చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో హరీశ్వర్ రెడ్డి తెరాసలో చేరుతారన్నారు. మరికొందరు నేతలు, ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నవంబర్ 5, 6 తేదీల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
త్వరలో తెరాసలోకి వలసలు పెరుగుతాయన్నారు. పలువురు నాయకులు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు. అయితే అందరినీ పార్టీలోకి తీసుకోమని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న వారిని ఆహ్వానిస్తామన్నారు. బొత్స కూతురు పెళ్లికి విజయనగరం వెళ్లాలా వద్దా అనేది ఆలోచిస్తానని చెప్పారు.
టిడిపి యూ-టర్న్ తీసుకుంది
తెలుగుదేశం పార్టీ తెలంగాణపై యూ-టర్న్ తీసుకుందని పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణకు ఓకే చెప్పి కేంద్రం ప్రకటన వచ్చాక టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెనక్కి వెళ్లారన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణపై నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.