హరీశ్వర్ రెడ్డి దారిలో నాగం జనార్ధన్: కెసిఆర్ గూటికే
తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం మధ్యాహ్నం హరీశ్వర్ రెడ్డి ఇంటికి లంచ్కి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హరీశ్వర్ను కెసిఆర్ తెరాసలోకి ఆహ్వానించారు. నవంబర్ 15న చేవెళ్లలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో హరీశ్వర్ తెరాసలో చేరతారని కెసిఆర్ ఆ తర్వాత ప్రకటించారు. హరీశ్వర్ రెడ్డి దారిలోనే వేణుగోపాల చారి కూడా తెరాసలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట.
హరీశ్వర్, చారి దారిలోనే నాగం కూడా కారు ఎక్కే అవకాశాలు లేకపోలేదంటున్నారు. తెలంగాణ కోసం మరో వేదికను ఏర్పాటు చేద్దామని బయటకు వచ్చిన నాగం కోరిక నెరవేరలేదు. ఆయనతో టిడిపి నుండి ఎవరైతే బయటకు వచ్చారో వారు మాత్రమే ఉన్నారు. ఇటీవల వారు కూడా ఓ వేదిక కోసం చూస్తున్నారు. దీంతో ఇప్పుడు నాగం ఒంటరి అయ్యారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆయనకు ఓ వేదిక ఆవశ్యకత ఉంది.
తెలంగాణపై వైఖరి స్పష్టం చేయలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ నుండి వచ్చారు. కానీ ఇప్పటి వరకు టిడిపి తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. దీంతో అతను తిరిగి ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం లేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా టిడిపి ధోరణితోనే ఉంది. అప్పట్లో జగన్ పార్టీలోకి వెళ్తారనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. తెలంగాణ విషయంలో టిడిపి-వైయస్సార్ కాంగ్రెసుల వైఖరిలు ఒకేలా ఉన్నందు వల్ల అందులోకి వెళ్లడానికి వీలులేకుండా పోయింది.
తెలంగాణను తేల్చాల్సిన కాంగ్రెసు పార్టీ దానిని జాప్యం చేస్తూ వస్తోంది. తెలంగాణవాదుల యుద్ధం కాంగ్రెసు పైనే. కాంగ్రెసు పార్టీ ఎంపీలు కూడా అధిష్టానంపై తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నారు. అందులోనూ నాగంకు కాంగ్రెసు అంటే గిట్టదు. తెలంగాణ విషయంలో బిజెపి స్పష్టమైన వైఖరితో ఉంది. అయితే ఆ పార్టీలో చేరేందుకు నాగం సిద్ధంగా లేరని తెలుస్తోంది. అదే అయితే గతంలో బిజెపి ఆహ్వానించినప్పుడే వెళ్లేవారు. ఇక మిగిలింది కేవలం తెరాస మాత్రమే.