జగన్తో పొసగకే, శ్రీదేవిపైనే ఫీల్ కాలేదు: జయసుధ
హైదరాబాద్: హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే తాను తప్పుకుంటానని కాంగ్రెసు సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ అన్నారు. మనం నిల్చున్న చోట క్లీన్గా ఉండాలని, మన పట్ల ప్రజల్లో గౌరవం పెరగాలని, అలా లేనినాడు అక్కడ ఉండడం సరికాదని, ఇది తన అభిప్రాయమని ఆమె అన్నారు. దేనినైనా కొనేయవచ్చని భావించేవాళ్లకే పార్టీలో ప్రాధాన్యం దక్కుతుందంటే అక్కడ తాను ఉండలేనని, మాజీ మేయర్ బండ కార్తికా రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే .. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో మొదటిస్థానంలో ఉన్నట్లే లెక్క అని, అలాంటి పార్టీలో నేనెందుకు ఉండాలని ఆమె అన్నారు.
శుక్రవారం ఆమె ఓ ప్రముఖ దినపత్రికతో మాట్లాడారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిదని, దానిని మరచిపోతే ఎలా అని ప్రశ్నించారు. పార్టీలో తనకంటే కార్తికరెడ్డి దంపతులకే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను చూస్తూ సహించలేనని చెప్పారు. ఇదే విషయాన్ని కొందరు పార్టీ ముఖ్యులతో చెప్పానని ఆమె అన్నారు.
అయితే ఇదంతా సహజమేనని, చూసీ చూడనట్లుండాలంటూ తనకే ఉచిత సలహా ఇచ్చారని అన్నారు. తాను ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానంటే ముఖ్యమంత్రి కిరణ్ని చూసేనని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి నిజాయితీగా వ్యవహరిస్తూ ఎక్కడో ఉన్న పార్టీని మళ్లీ గాడిలోకి తీసుకురాగలిగారని చెప్పారు. అయితే.. ఇలాంటి తరుణంలోనూ కార్తికరెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కిందంటే మాత్రం కాంగ్రెస్లో నిజాయితీకి స్థానం లేదని తేటతెల్లమవుతుందని అన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడి తన మనసులోని మాటను వినిపించారు.
ఎంపీ పదవికి కావాలసిన అన్ని యోగ్యతలూ తనలో ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పెట్టిన కొత్తలో జగన్ అన్నారని జయసుధ చెప్పారు. కానీ, తర్వాత ఆ పార్టీతో పొసగకే తాను బయటకు వచ్చేశానని అన్నారు. మళ్లీ తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తే పార్టీ మారడం కోసమే ఇదంతా మాట్లాడుతున్నట్లుగా అవుతుందని జయసుధ చెప్పారు.
తనకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలాంటి వ్యతిరేకతా లేదని, బండ చంద్రారెడ్డి దంపతుల వ్యవహారశైలిపై వ్యక్తిగతంగా ఉన్న భేదాభిప్రాయాలే కారణమని అన్నారు. వాళ్లను చూసి ఈర్ష్యతో ఇదంతా చేస్తున్నానని కొందరు అంటున్నారని, ఒకప్పుడు సినిమా రంగంలో శ్రీదేవి, జయప్రద వంటి హీరోయిన్లు ఉన్నప్పుడే తాను జెలసీ ఫీల్ కాలేదని అన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు తగిన గుర్తింపు, నిజాయితీకి ప్రాధాన్యం ఉండాల్సిందేనని జయసుధ అన్నారు. అది లేనప్పుడు పార్టీకి దూరంగా ఉంటానని అన్నారు. అయితే.. తాను తక్షణమే ఏదో పార్టీలో చేరబోనని జయసుధ స్పష్టం చేశారు.