విపరీతం: అఫ్జల్ ఉరిని ఖండిస్తూ పాక్ తీర్మానం
మరో రెండు రోజుల్లో ఐదేళ్ల కాలపరిమితి ముగియనున్న దశలో జాతీయ అసెంబ్లీ లేదా దిగువ సభ ఆ తీర్మానం చేసింది. కాశ్మీర్పై ప్ర్తత్యేక పార్లమెంటరీ ప్యానెల్కు నేతృత్వం వహిస్తున్న జమైత్ ఉలేమా - ఎ -ఇస్లామ్ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ఆ తీర్మానాన్ని ప్రతిపాదించారు.
పాకిస్తాన్ పార్లమెంటు అఫ్జల్ గురు ఉరితీతను ఖండించడమే కాకుండా ఉరితీత కారణంగా జమ్మూ కాశ్మీర్లో కల్పించిన పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అప్జల్ గురును ఫిబ్రవరి 9వ తేదీన తీహార్ జైలులో ఉరితీసి అక్కడే సమాధి చేసిన విషయం తెలిసిందే. అఫ్జల్ గురు ఉరితీతతో జమ్మూ కాశ్మీర్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి.
పాకిస్తాన్ పార్లమెంటు చేసిన తీర్మానం దాంతో ఆగకుండా మరింత ముందుకు వెళ్లింది. కాశ్మీర్ వివాదంపై అంతర్జాతీయ సమాజం ప్రేక్షక పాత్ర వహించడం మంచిది కాదని, సమస్యకు పరిష్కారం కనుక్కునేందుకు ప్రయత్నించాలని పాకిస్తాన్ ఆ తీర్మానంలో కోరింది. జమ్మూ కాశ్మీర్లో చంపడాన్ని ఆపేయాలని, కాశ్మీర్ లోయలోని పట్టణాల నుంచి, నగరాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కూడా కోరింది.
ఖైదీలను విడుదల చేయాలని, నల్లచట్టాలను ఉపసంహరించుకోవాలని, కర్ఫ్యూను ఎత్తేయాలని పాకిస్తాన్ పార్లమెంటు కోరింది. అఫ్జల్ గురు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్బుల్లా, ఇతర ప్రధాన రాజకీయ గ్రూపులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తన తీర్మానంతో పాకిస్తాన్ కాశ్మీర్లో పరిస్థితి మరింత విషమించేలా పాకిస్తాన్ చేసింది.