జగన్ జగతిలో నిమ్మగడ్డ పెట్టుబడులపై ఐటి దృష్టి
జగతి పబ్లికేషన్స్ పన్ను మదింపు కోసం వాన్పిక్ వ్యవహారంపై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ను తమకు ఇవ్వాలని కోరుతూ ఐటి శాఖ అధికారులు సిబిఐ కోర్టును కోరారు. దాంతో పాటు ఒప్పంద పత్రాలను, ఇతర నోట్ షీట్లను కూడా తమకు ఇవ్వాలని వారు కోరారు. అందుకు నాంపల్లిలోని సిబిఐ కోర్టు అనుమతించింది.
నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన వాన్పిక్ వ్యవహారంపై నిరుడు ఆగస్టు 13వ తేదీన చార్జిషీట్ దాఖలు చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇది నాలుగవ చార్జిషీట్. ఈ చార్జిషీట్ కోసం ఐటి శాఖ అధికారులు సిబిఐ అధికారులను సప్రదించారు. అయితే, కోర్టు అనుమతితో వాటిని తీసుకోవాలని సిబిఐ సూచించింది. దీంతో డిసెంబర్ 3వ తేదీన వాటి కోసం ఐటి శాఖ కోర్టును ఆశ్రయించింది.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందిన వాన్పిక్ అందుకు ప్రతిఫలంగా వైయస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సిబిఐ ఆరోపించింది. ఈ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్ ప్రసాద్ను సిబిఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ఉన్నారు. వైయస్ జగన్ కూడా చంచల్గుడా జైలులోనే ఉన్నారు. వాన్పిక్ వ్యవహారంలో దాఖలు చేసిన చార్జిషీట్లో సిబిఐ మంత్రి ధర్మాన ప్రసాదరావును నిందితుడిగా చేర్చింది.