ముమ్మాటికి వైయస్సే: ఆనంకు అండ, టిఎంపీలపై జానా
తెర వెనుకతో మంత్రులకు సంబంధం లేదు: బొత్స
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన సిఎం హోదాలో చెప్పిన కార్యక్రమాలు మంత్రులు చేశారని, తెర వెనుక లావాదేవీలతో వారికి ఏమాత్రం సంబంధం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చిత్తూరు జిల్లాలో అన్నారు.
అప్పట్లో తీసుకున్న ప్రతి నిర్ణయానికి మంత్రులందరూ సమష్టి బాధ్యత వహించాల్సిందేనని చెప్పారు. అయితే, తెర వెనుక జరిగిన లావాదేవీలు, లాలూచీలకు మంత్రులకు సంబంధం లేదన్నారు. తెర వెనుక వ్యవహారాలతో సంబంధం ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు.
టిఎంపీలది మీడియాలో చూశా: జానా
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరుతారనే విషయాన్ని తాను మీడియాలో చూశానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఆదివారం హైదరాబాదులో అన్నారు. సీనియర్ నేత కె కేశవ రావుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపీలు తెరాసలో చేరే విషయం తమకు తెలియదన్నారు. తాను మీడియాలోనే చూశానన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా మీడియాకు చెబుతానని చెప్పారు.