జన్మభూమికి వెళ్లకపోతే టీసీలిస్తాం...ఇచ్చుకోండంటూ విద్యార్థుల ఆందోళన...కలకలం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఒక కాలేజీ యాజమాన్యం విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. జన్మభూమి కార్యక్రమానికి వెళ్లకపోతే టీసీలు ఇస్తామంటూ కాలేజీ యాజమాన్యం బెదిరించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగడం కలకలం రేపింది.
మంత్రి పాల్గొంటున్న జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనకుంటే టిసిలు ఇచ్చి ఇంటికి పంపేస్తామని చిత్తూరు జిల్లా మదనపల్లి లోని బీటీ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు హుకుం జారీ చేసిందట. అంతేకాకుండా విద్యార్ధులు ఇళ్లకు వెళ్లకుండా కళాశాల గేట్లు మూసేసిందట. దీంతో కళాశాల యాజమాన్య తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులందరికీ టీసీలు ఇచ్చేయండి అంటూ తాళం వేసిన గేట్ల ముందే యాజమాన్యంకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగినట్లు తెలిసింది.

ఎంతో చారిత్రక నేపథ్యం కల బీటీ కాలేజీని నాశనం చేసేందుకు ప్రైవేటు వ్యక్తులు చూస్తున్నారని, కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టే పనులు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. బలవంతంగా రాజకీయపార్టీల కార్యకలాపాలకు విద్యార్థులను వినియోగించుకోవడం దారుణం అని వాపోయారు. ఇప్పటికైనా ప్రైవేట్ వ్యక్తులను కాలేజీకి దూరంగా పెట్టి తమ కళాశాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications