సెలవు వద్దన్న కలాం, బాబు ఫాలో: ఏపీలో పాఠశాలలు అదనంగా గంటపాటు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ గంటపాటు పాఠశాలలు అదనంగా పని చేయనున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి నేపథ్యంలో మంగళవారం నాడు పాఠశాలలు అదనంగా పని చేయాలని విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు.
అదనపు గంటలో అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పైన విద్యార్థులకు బోధన చేయాలని ఆదేశించారు. పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా గంటపాటు అదనంగా పని చేయనున్నాయి.
తాను మృతి చెందినప్పుడు పాఠశాలలు, కార్యాలయాలు బంద్ చేయవద్దని, అవసరమైతే అదనంగా మరో రోజు అవి పని చేయాలని అబ్దుల్ కలాం చెప్పారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం మాట్లాడుతూ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం కూడా కలాం మృతి నేపథ్యంలో సెలవు దినంగా ప్రకటించలేదు. కలాం మృతి నేపథ్యంలో ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. అయితే, మంగళవారం నాడు సెలవు అన్నట్లుగా వార్తలు రావడంతో దానిని తోసిపుచ్చింది.
నేడు జాతీయ సెలవు దినం కాదని కేంద్రం ప్రకటించింది. నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉంటాయని ఉదయం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. తాను మరణిస్తే సెలవు ఇవ్వవద్దని కలాం చెప్పిన నేపథ్యంలో దానిని కేంద్రం, ఏపీ ప్రభుత్వం పాటించాయి.