షాకైన ఏసీబీ: ఒక్క విద్యార్థీ లేని హాస్టల్ నెల ఖర్చు రూ.4 లక్షలు
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం నాడు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో షాకింగ్ విషయం వెలుగు చూసింది. విద్యార్థులే లేని హాస్టల్ ఖర్చు నెలకు రూ.4 లక్షలు.
ఏసీబీ హాస్టళ్లలో పత్రాలు పరిశీలించారు. కొన్ని హాస్టళ్లలో రిజిస్టర్లో ఉన్న పేర్ల కంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఒక్క విద్యార్థి కూడా లేనట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఏసీబీ దాడుల ద్వారా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు ఏర్పాటైన ప్రభుత్వ హాస్టళ్లలో అవినీతి ఏ మేరకు జరుగుతోందనే విషయం కళ్లకు కడుతోంది. ఏసీబీ అధికారులు పలు ప్రాంతాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హాస్టళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.
ఈ సందర్భంగా నందిగామ పరిధిలోని ఓ హాస్టల్ లో ఒక్క విద్యార్థి కూడా ఏసీబీ అధికారులకు కనిపించలేదు. దీంతో ఆశ్చర్యానికి గురైన అధికారులు హాస్టల్లోని రికార్డులు చూసి షాకయ్యారు. ఒక్క విద్యార్థి కూడా లేని సదరు హాస్టల్కు ప్రభుత్వం నెలకు రూ.4 లక్షలను విడుదల చేస్తోందట.
ఇంట్లో భారీ పేలుడు
విజయవాడలోని పడమటి విజయనగర్ కాలనీలో ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. రెడ్డి రంగస్వామి అనే వ్యక్తి ఆటోనగర్లో పాత ఇనుము వ్యాపారం చేస్తుంటాడు. ఆయన విజయనగర్ కాలనీలో ఉంటున్నాడు.
శుక్రవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రంగస్వామి ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లో సామాన్లు చెల్లాచెదురయ్యాయి. ఘటనలో తీవ్రంగా గాయపడిన రంగస్వామిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాంబ్స్క్వాడ్ బృందాలు ఘటనాస్థలం వద్ద తనిఖీలు చేపట్టాయి.