పరిటాల ముందే భగ్గుమన్న విభేదాలు: కరణం, గొట్టిపాటి మాటల తూటాలు
తెలుగుదేశం పార్టీ అద్దంకి నేతల్లో రగులుతున్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అది కూడా రాష్ట్ర శిశుసంక్షేమశాఖమంత్రి పరిటాల సునీత సమక్షంలోనే కావడం గమనార్హం. అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్,
ప్రకాశం: తెలుగుదేశం పార్టీ అద్దంకి నేతల్లో రగులుతున్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అది కూడా రాష్ట్ర శిశుసంక్షేమశాఖమంత్రి పరిటాల సునీత సమక్షంలోనే కావడం గమనార్హం. అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్, శాసనమండలి సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి మధ్య మాటల తూటాలు పేలాయి. మంత్రి సమక్షంలోనే ఇరువర్గాలు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగాయి.

గొట్టిపాటిపై కరణం ఆగ్రహం
వివరాల్లోకి వెళితే.. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశం రాష్ట్ర శిశుసంక్షేమ శాఖమంత్రి పరిటాల సునీత అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈసమావేశంలో శాసనమండలి సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ.. అద్దంకి నియోజకవర్గపరిధిలో తెలుగుదేశంపార్టీకి చెందిన వారి పెన్షన్లను శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ పీకేశారని ఆరోపించారు. అదేవిధంగా తనతో వచ్చిన వైసీపీకి చెందిన నాయకులు,కార్యకర్తలకు పెన్షన్లను ఇస్తున్నారని మంత్రి దృష్టికి కరణం తీసుకొచ్చారు.

వెంటనే లేచిన గొట్టిపాటి
వెంటనే గొట్టిపాటి రవికుమార్ కలగచేసుకుని అన్ని కరణం బలరాం అబద్దాలు చెబుతున్నారని తాను తరువాత మాట్లాడతానని మంత్రికి చెప్పిన గొట్టిపాటి సమావేశంనుండి నిష్క్రమించారు. ఈ విషయం జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. జిల్లాలోని 11నియోజకవర్గాల రాజకీయాలు ఒక ఎత్తు అయితేకేవలం అద్దంకి నియోజకవర్గ రాజకీయం మరొక ఎత్తుగా మారింది.

అధిష్టానానికి తలనొప్పే..
జిల్లాలోని అద్దంకి నియోజకవర్గ రాజకీయాలు టీడీపీ అధిష్టానానికి పెద్దతలనొప్పిగా మారాయి. మరోసారి మంత్రి పరిటాల సమక్షంలో వర్గవిభేదాలు భగ్గుమనటంతో ఈ విషయం టీడీపీ అధిష్టానం వరకూ వెళ్లింది. ఇటీవల అద్దంకి నియోజకవర్గ బాధ్యతలు గొట్టిపాటి రవికుమార్కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పగించారు. కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం గొట్టిపాటి, కరణంల మధ్యమాత్రం రాజకీయ యుద్దం జరుగుతూనే ఉంది.

కరణంపై గొట్టిపాటి..
కాగా, అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. తెలుగుదేశంపార్టీకి చెందిన పెన్షన్లను తొలగించానని బలరాం మంత్రి దృష్టికి తీసుకురావటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అన్ని బలరాం అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో మూడువేల పెన్షన్లను ఇస్తున్నామని, మరోక వెయ్యి పెన్షన్లను ముఖ్యమంత్రి ఇస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. మొత్తంమీద అద్దంకి రాజకీయం మలుపు ఏవిధంగా తిరుగుతుందోనన్న ఉత్కంఠలో తెలుగుతమ్ముళ్లు ఉన్నారు.

గెలుపే లక్ష్యంగా..
కాగా, ఈసమావేశంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈసందర్బంగా మంత్రి పరిటాల మాట్లాడుతూ.. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గసమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని నాయకులకు హామీ ఇచ్చారు. నాయకులందరు సమన్వయంగా ఉండి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలుపులక్ష్యంగా ప్రతీ ఒక్కరు కృషిచేయాలని ఆమె నాయకులను కోరారు. ఈసమావేశంలో జిల్లాతెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, బాపట్ల పార్లమెంటు సభ్యుడు శ్రీరాం మాల్యాద్రి,రేపల్లె శాసనసభ్యుడు సత్యప్రసాదు, గుంటూరు ఎంఎల్సి అన్నం సతీష్ ప్రభాకర్, పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు,చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్,ఎంఎల్సి పోతుల సునీత, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జీ బిఎన్ విజయకుమార్తోపాటు తదితరులు పాల్గొన్నారు.

అధినేత స్పందించకపోతే..
ఇది ఇలా ఉండగా, జిల్లాలోని గిద్దలూరు, చీరాల, కందుకూరు నియోజకవర్గాల్లోనూ తెలుగుతమ్ముళ్ల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఆదివారం మంత్రి నారాయణ అధ్యక్షతన జరిగిన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ సమావేశం ప్రశాంతంగానే సాగినప్పటికి బాపట్ల నియోజకవర్గ సమావేశం మాత్రం ప్రశాంతంగా జరగలేదు. ఇప్పటికైనా ఈ నాలుగు నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి దృష్టిసారించకపోతే మాత్రం ఆ నియోజకవర్గాల్లో ఆ పార్టీ రానున్న రోజుల్లో భారీమూల్యం తప్పదని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications