చిత్తూరు జిల్లాలో తలలేని చిన్నారి మృతదేహం కలకలం...నరబలి ఇచ్చారా?
చిత్తూరు జిల్లా పెనమలూరు మండలంలోని చెరువులో తల లేని ఓ చిన్నారి మొండెం బైటపడటం సంచలనం సృష్టించింది. కల్వకుంట ఎన్టీఆర్ జలశయంలో సుమారు 8 నెలల వయస్సున్న పసికందు మొండెం పడి ఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పైగా పసికందు మృతదేహానికి తల లేకపోవడంతో ఎవరైనా క్షుద్ర పూజల్లో భాగంగా నరబలి ఇచ్చారేమో అన్న చందంగా స్థానికులు చర్చించుకుంటున్నారు.
అంతేకాకుండా జలాశయం ఒడ్డున పూజాసామాగ్రి ఉండడంతో చిన్నారిని నరబలి ఇచ్చుంటారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే జలాశయంలో బైటపడిన చిన్నారి మృత దేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. దీంతో ఈ ఘటన జరిగి కొన్ని రోజులై ఉంటుందని భావిస్తున్నారు. చిన్నారి మృతదేహం సమాచారం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
స్థానికులు అనుమానిస్తున్నట్లు పసికందును క్షుద్రపూజల కోసం నరబలి ఇచ్చారా?...ఎవరా పసికందు? ఎక్కడినుంచి తీసుకువచ్చారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు బాలుడి తల ఆచూకి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు.