అసెంబ్లీ: ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్కు సగం మార్కులే
హైదరాబాద్: ఐదు రోజులే అయినా ఆంధ్రప్రదేశ్ శానససభా సమావేశాలు వాడివేడిగా జరిగాయి. నిజానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చాలా అంశాలున్నాయి. అయితే, అంశాలను సరైన రీతిలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేయడంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పూర్తిగా ఫలితం సాధించలేకపోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వైయస్ జగన్లో రాజకీయానుభవం కొట్టొచ్చినట్లు కనిపించిందనే మాట వినిపిస్తోంది. దీన్ని చంద్రబాబు అవకాశంగా తీసుకుని ఎదురు దాడికి దిగారు. రాజమండ్రి పుష్కర ఘాట్లో తొక్కిసలాట అంశాన్ని మృతులకు సంతాపం ప్రకటించే సందర్భంలో చంద్రబాబుపై విమర్శలు చేస్తూ దూకుడు ప్రదర్శించడాన్ని అనుభవరాహిత్యంగాన్నే పరిగణిస్తున్నారు. తొలి రోజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యూహరచన, దాని అమలు సరిగా లేదనే మాట వినిపించింది.
అలాగే. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రకటన విషయంలో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొంత అపరిపక్వతను చాటుకుందనే మాట వినిపిస్తోంది. చంద్రబాబు ప్రకటనను అడ్డుకోవడం సరి కానట్లు అనిపించింది. అలా అడ్డుకోవడం వల్ల సభా కొనసాగకపోవడమే కాకుండా సమయం వృధా అయింది. వైయస్సార్ కాంగ్రెసు దాని నుంచి ఏ విధమైన ఫలితాన్ని కూడా రాబట్టలేకపోయింది.
మర్నాడు అనుసరించిన వ్యూహం ఫలితాన్ని ఇచ్చింది. చంద్రబాబు ప్రకటన పూర్తయిన తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై మాట్లాడిన తీరు చాలా మందిని ఆకట్టుకోవడమే కాకుండా కొంత మేరకు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. జగన్ మాట్లాడే ప్రతిసారీ మంత్రులు, తెలుగుదేశం సభ్యులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, జగన్పై వారు గతంలో చేసిన వ్యాఖ్యలే కాబట్టి వాటి ప్రభావం కొత్తగా ఉండే అవకాశమేమీ లేదు. కాకుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులను రెచ్చగొట్టడానికి పనికి వచ్చాయి. వాటికి రెచ్చిపోకుండా అంశంపై మాట్లాడే సమయంలో ప్రతివిమర్శ పెడుతూ వాటికి సమాధానం ఇస్తూ వెళ్తే మరింతగా ఆకట్టుకని ఉండేది.
కాగా, పట్టిసీమ విషయంలో జ్యోతుల నెహ్రూ పార్టీ వైఖరిని స్పష్టం చేయడంలోనూ పట్టిసీమలో చోటు చేసుకుంటున్న విషయాలను వివరించడంలోనూ విఫలమైనట్లు కనిపిస్తున్నారు. ఆయన సమయానికి తగినట్లు తన ప్రసంగాన్ని మార్చుకోలేదని అనిపించింది. శాసనసభా సమావేశాలు ముగిసిన తర్వాత జగన్ మీడియా సమావేశంలో పట్టిసీమపై చాలా స్పష్టంగా పార్టీ వైఖరిని చెబుతూ పట్టిసీమలో అవినీతి చోటు చేసుకుంటున్న వైనాన్ని కూడా వివరించారు. అదే పద్ధతిని జ్యోతుల నెహ్రూ శాసనసభలో అనుసరించి ఉంటే ఫలితం దక్కి ఉండేది.
కాగా, నోటుకు ఓటు విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార పార్టీపై ఆధిపత్యం సాధించినట్లుగానే కనిపించింది. నిజానికి, పట్టిసీమ, రాజమండ్రి తొక్కిసలాట, ప్రత్యేక హోదా, రిషితేశ్వరి ఆత్మహత్య అంశాలు వివిధ నిబంధనల కింద చర్చకు వచ్చేట్లు చూసుకుని సమయం వృధా కాకుండా ముగించి ఉంటే ఆ తర్వాత ఓటుకు నోటు కేసును చేపట్టి ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ ఫలితాన్ని రాబట్టి ఉండేదని రాజకీయ నిపుణులు అంటున్నారు.
ఓటుకు నోటు కేసుపై చివరి రోజు వాయిదా తీర్మానం ప్రతిపాదించడమే కాకుండా 344 నిబంధన కింద చర్చకు నోటీసు కూడా ఇచ్చినట్లు వైయస్ జగన్ చెప్పారు. వాయిదా తీర్మానాన్ని తోసిపుచ్చిన తర్వాత కనీసం 344 నిబంధన కింద చర్చకయినా అంగీకరించాలని పట్టుబట్టి ఉంటే ఫలితం ఉండేది.
ప్రతిపక్షంగా తాము విఫలమయ్యామా, సఫలమయ్యామా అనేది ప్రజలు తేల్చుకుంటారని జగన్ మీడియా సమావేశంలో అన్నారు. అది నిజం కూడా...