ఏపీ కేబినెట్ లో నూతన మంత్రుల ప్రస్థానం ఇలా!...శాఖలు ఇవీ...ఆరు నెలలే సమయం
అమరావతి:ఆంధ్రప్రదేశ్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్త మంత్రులుగా ఎన్.ఎమ్.డి. ఫరూక్, కిడారి శ్రావణ్కుమార్ లకు సిఎం కేబినెట్ లో చోటు కల్పించారు. ఆదివారం ఉదయం గవర్నర్ నరసింహన్ ఇరువురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ముందుగా శాసన మండలి చైర్మన్, సీనియర్ నాయకుడు ఎన్ఎండీ ఫరూక్ మంత్రిగా ప్రమాణం చేయగా అనంతరం కిడారి శ్రవణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఫరూక్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఎపి క్యాబినెట్ లో ఎట్టకేలకు ముస్లీం మైనార్టీ సామాజిక వర్గానికి అవకాశం దక్కినట్లయింది. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ కేబినెట్ విస్తరణ జరగడంతో ఇరువురు మంత్రులు ఆరు నెలలు మాత్రమే పదవిని నిర్వహించే అవకాశం ఉంది.
నూతన మంత్రులు...ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ, ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు ఆదివారం ఉదయం వెంటవెంటనే జరిగిపోయాయి. కొత్త మంత్రులుగా ముస్లి మైనారిటీ నేత ఎన్.ఎమ్.డి. ఫరూక్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రవణ్ ప్రమాణస్వీకారం చేశారు. ఇరువురు నూతన మంత్రులతో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రులు, పార్టీనేతలు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఇద్దరు మంత్రులు సిఎం చంద్రబాబునాయుడి ఆశీర్వాదం తీసుకున్నారు.
కేబినెట్ లోకి...ఫరూక్ ప్రస్థానం
ఇక ఇరువురి మంత్రుల బయోడేటా విషయానికొస్తే...కర్నూలు జిల్లాలోని నంద్యాలకు చెందిన ఎన్.ఎం.డి ఫరూక్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం అనంతరం పార్టీలో చేరి అప్పటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు.1985లో తొలిసారి నంద్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి పార్థసారధి రెడ్డితో పోటీపడిన ఫరూక్ సుమారు ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం 1989 ఎన్నికలలో టీడీపీ తరుపున రెండోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 1994లో మరోసారి ఫరూక్ విజయం సాధించారు. అనంతరం వరుస ఓటములతో ఆయనకు టిడిపి నంద్యాల టిక్కెట్ కేటాయించలేదు.
ఆ రెండు మలుపులతో...అదృష్టం
దీంతో ఆయన సైలెంట్ గా మారిపోవడంతో పాటు ఒకానొక సమయంలో టిడిపిని వీడనున్నట్లు పెద్దఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే అలాంటి తరుణంలో అనూహ్యంగా వచ్చిన నంద్యాల ఉప ఎన్నికలు ఆయన రాజకీయ జీవితానికి మళ్లీ జీవం పోశాయి. నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రత్యేక దృష్టి సారించిన సిఎం చంద్రబాబు అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఫరూక్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అదే క్రమంలో మండలి ఛైర్మన్ పదవిని కూడా ఇచ్చారు. అయితే గతంలో బిజెపితో పొత్తు కారణంగా దూరమైన ముస్లింమైనారిటీలను మళ్లీ పెద్ద ఎత్తున ఆకర్షించే క్రమంలో వారికి మరింత ప్రాధాన్యత పదవుల కేటాయింపు ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అలా జలీల్ ఖాన్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పదవి దక్కగా తాజాగా ఫరూక్ కు ఏకంగా కేబినెట్ లో చోటు లభించింది. ఇలా రెండు అనూహ్య పరిణామాలతో అదృష్టం కలసివచ్చిన ఫరూక్కు సిఎం చంద్రబాబు మైనారిటీ సంక్షేమ శాఖతో పాటు తన వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖ కేటాయించే అవకాశం ఉంది.
కిడారి శ్రవణ్...అనూహ్యంగా కేబినెట్ లోకి
ఇక ఎస్టీ సామాజికవర్గానికి మంత్రి వర్గంలో స్థానం కల్పించేందుకు గాను అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రవణ్ కుమార్ కు సిఎం చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. అయితే కిడారి శ్రవణ్ ఏ చట్ట సభలోనూ సభ్యుడు కాకుండా నేరుగా మంత్రి పదవి పొందడంతో ఆరు నెలలలోగా ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇంక ఏడాది సమయం కూడా లేకపోవడంతో ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేనందున కిడారి శ్రవణ్ ఆరు నెలలు మాత్రమే మంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఆ తరువాత ఎలాగూ సార్వత్రిక ఎన్నికలు వస్తాయి కనుక అప్పుడు అరకు నుంచి శ్రవణ్ నే ఎమ్మెల్యేగా బరిలోకి దించాలనేది సిఎం చంద్రబాబు అభిమతంగా తెలిసింది. ఇక నూతన మంత్రి కిడారి శ్రవణ్ కు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది.