18న ఏపీ కేబినెట్: పోలవరం..వైఎస్ విగ్రహం ఏర్పాటు సహా: జగన్ జిల్లాల పర్యటనపైనా
అమరావతి: ఈ నెల 18వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అమరావతి ప్రాంతంలోని వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ భేటీ ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ అన్ని శాఖలు, విభాగాల అధిపతులకు సర్కులర్ను ఇదివరకే జారీ చేశారు. 16వ తేదీ నాటికి సమావేశం అజెండా వివరాలను ఇంకా ఖరారు చేస్తారు. ఈ నెల 25వ తేదీన ప్రారంభించ తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ పథకం, పోలవరం ప్రాజెక్టు నిధులు కేటాయింపు, పరిశ్రమలకు భూముల కేటాయింపు వంటి అంశాలపై చర్చిస్తారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద 100 అడుగుల డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నిర్మాణానికీ ఈ కేబినెట్ భేటీలో ఆమోదించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. నివర్ తుఫాన్ వల్ల సంభవించిన నష్టంపై అధికార యంత్రాంగం రూపొందించిన నివేదికపై మంత్రివర్గం చర్చిస్తుంది. అనంతరం దీన్ని ఆమోదిస్తుంది. నివర్ తుఫాన్పై ఇదే తుది నివేదిక కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇందులో చేర్చాల్సిన అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చిస్తుంది.
నివర్ తుఫాన్ వల్ల రాయలసీమ జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. పరిహారంగా రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ధరను ఈ భేటీలో నిర్ధారిస్తారని తెలుస్తోంది. జనవరిలో ఏపీపీఎస్సీ ద్వారా కొన్ని ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అంశం.. మంత్రివర్గ సమావేశంలో చర్చకు వస్తుందని తెలుస్తోంది. శాఖలు, విభాగాలవారీగా ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలంటూ ఇదివరకే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఓ సమగ్ర నివేదికను రూపొందించిందని, దీనిపై మంత్రివర్గంలో చర్చిస్తారని అంటున్నారు.
Recommended Video
పరిపాలన రాజధానిగా బదలాయించాలని భావిస్తోన్న విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రూపొందించిన కొన్ని ప్రతిపాదలపై మంత్రివర్గం ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఏడాదిలో అమలు చేయదలిచిన కొన్ని ప్రభుత్వ పథకాలు, చేపట్టదలిచిన అభివృద్ధి కార్యక్రమాలు.. మంత్రివర్గం సమక్షానికి రానున్నాయి. పరిశ్రమలకు భూముల కేటాయింపు.. నూతన పారిశ్రామిక విధానం, ఇసుక సరఫరా వ్యవస్థలో లోపాలు, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన వంటి విషయాలు మంత్రివర్గంలో ప్రస్తావనకు వస్తాయని తెలుస్తోంది.