అపెక్స్ కౌన్సిల్లో బాబు, కేసీఆర్: ఎవరి వాదనలు వారివే, కీలక నిర్ణయాలివే
న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుతో పాటు ఇరు రాష్ర్టాల నీటి పారుదల శాఖ మంత్రులు, ఇంజినీర్లు హాజరయ్యారు.
కేసీఆర్ ఇచ్చిన బొకేలోని గులాబీని లాగి బాబుకిచ్చిన ఉమాభారతి
సుమారు రెండు గంటల పాటు సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనలు వినిపించాయి. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకోమని తేల్చిచెప్పింది. చివరకు ఈ సమావేశంలో రెండు అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.
నీటి లెక్కలపై ఇరు రాష్ట్రాలు టెలి మీటర్ల ఏర్పాటుకు అంగీకరించాయి. అదే విధంగా సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఇంజనీర్ల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి మీడియాతో మాట్లాడుతూ మంచి వాతవరణలో చర్చలు జరిగాయని చెప్పారు.
ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గొడవలతో వచ్చే ప్రయోజనం ఏదీ లేదని అన్నారు. సామరస్య వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. మరో రెండు అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని అన్నారు.
పరస్పరం సహకరించుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్రమంత్రి ఉమాభారతి సూచించారు. కృష్ణా జలాల విషయంలో కర్ణాటక, మహారాష్ట్రల వివాదంపైనా భేటీలో చర్చించినట్లు ఆమె తెలిపారు. నదీ జలాల పంపిణీ విషయంలో వివాదాల పరిష్కారానికి మార్గం గురించి ఆలోచించామని అన్నారు.
నీటి లభ్యత ఆధారంగా అంచనా వేసి ఇరు రాష్ర్టాలకు దామాషా ప్రకారం నీటి పంపిణీ జరుగుతుందని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి లభ్యతను అంచనా వేసేందుకు కేంద్రం, రెండు రాష్ట్రాల ఇంజినీరింగ్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. కమిటీ అధ్యయనం చేసిన నీటి లభ్యతపై గణాంకాల నివేదికను ట్రైబ్యునల్కు అందజేస్తుందని పేర్కొన్నారు. నీటి లభ్యత ఆధారంగా ట్రైబ్యునల్ సూచనల మేరకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.