బ్యాంకు అధికారినంటూ ‘ఏటిఎం పిన్’ తెలుసుకున్నాడు: రూ. 5లక్షల ట్రాన్స్ఫర్
నల్గొండ: ఇటీవల బ్యాంకు అధికారుల పేరిట మోసాలకు పాల్పడుతున్న కేసులు పెరిగిపోతున్నాయి. బ్యాంకులు తమ ఖాతారుల ఏటిఎం పిన్ నెంబర్లు ఎవరికీ చెప్పొద్దని సూచనలు చేస్తున్నప్పటికీ కొందరు.. మోసగాళ్ల బారినపడి మోసపోతూనే ఉన్నారు.
తాజాగా నల్గొండ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తాను ‘బ్యాంకు మేనేజర్'ను అని ఫోన్ చేసిన ఓ దుండగుడు, ఖాతాదారు పిన్ అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతని ఖాతా నుంచి రూ. 5లక్షలు తస్కరించాడు. దీంతో బాధితుడు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల కథనం ప్రకారం... మాన్యంచెల్కకు చెందిన దాదాబాషా బత్తాయి వ్యాపారి. అతనికి గురువారం ఓ వ్యక్తి బ్యాంకు అధికారినంటూ ఫోన్ చేశాడు. సాంకేతిక కారణాలతో ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని...పిన్ నంబర్ చెబితే సరిచేస్తానని నమ్మబలికాడు. దీంతో దాదాబాషా తన ఏటీఎం కార్డు నంబర్ చెప్పాడు.
ఆ వెంటనే సదరు వ్యక్తి అతని ఖాతాలో ఉన్న రూ.5 లక్షలను తన ఖాతాలోకి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా మార్చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత దాదాబాషా బ్యాంకుకు వెళ్లి... డబ్బు డ్రా చేయబోగా నగదు లేదని సమాచారం వచ్చింది. దీంతో అతడు వెంటనే అప్రమత్తమై బ్యాంకు మేనేజర్ కు ఫిర్యాదు చేశాడు.
ఆయన సూచన మేరకు డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయన వెంటనే స్పందించి పోలీసులను అప్రమత్తం చేశారు. నగదు మాయం చేసిన ఆగంతకుడి ఖాతాను బ్లాక్ చేయించారు. దీంతో దొరికిపోతాననే భయంతో నిందితుడు రూ.5 లక్షలను తిరిగి దాదాబాషా ఖాతాకు జమ చేశాడు. కాగా, నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.