జైలు నుంచి సత్యంబాబు విడుదల: అయేషాను రేప్ చేసి, చంపేశారు...
అయేషా కేసులో నిర్దోషిగా తేలిన సత్యంబాబు జైలు నుంచి విడుదలయ్యాడు. అయేషాను రేప్ చేసి, హత్య చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.
రాజమహేంద్రవరం: ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసులో నిందితుడిగా 8 ఏళ్లపాటు జైలులో ఉన్న పిడతల సత్యంబాబు హైకోర్టు తీర్పుతో శనివారం విడుదలయ్యాడు. అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. సత్యంబాబును తీసుకెళ్లేందుకు అతని తల్లి మరియమ్మ, న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ రాజమండ్రి వచ్చారు.
ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని ఆరోపించారు. చేయని నేరానికి నిందితుడిగా 8ఏళ్లపాటు శిక్ష అనుభవిస్తూ ఎంతో మానసిక క్షోభను అనుభవించిన సత్యంబాబు ఆలస్యంగానైనా నిర్దోషిగా విడుదల కావడం వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని ఆయన అన్నారు. అతను చేయని నేరానికి 8 ఏళ్ల జీవితాన్ని కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అతనికి తగిన నష్ట పరిహారం అందించాలని కోరారు.
ఈ వైఫల్యం గత ప్రభుత్వ హయాంలో జరిగినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం సత్యంబాబు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికైనా అసలైన దోషులను పట్టుకునేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. తన కుమారుడు నిర్దోషిగా బయటకు రావడం ఆనందంగా ఉందని సత్య బాబు తల్లి మరియమ్మ అన్నారు.
అత్యాచారం జరిపి హత్య చేశారు...
2007డిసెంబరు 27 ఉదయం అయేషా మృతదేహం రక్తపు మడుగులో నగ్నంగా పడి ఉండడాన్ని ఉండడాన్ని గుర్తించారు. డిసెంబరు 26 రాత్రి ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేశారని పోలీసులు నిర్థరించారు. తలపై బలంగా మోదడం వల్ల ఆమె మరణించింది. అంతకు ముందు ఆమె వస్త్రాలతోనే స్నానాల గదిలో కాళ్లు చేతులు కట్టి బలవంతంగా అత్యాచార ంజరిపినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది.
సత్యంబాబుకు అసలు పరిచయమే లేదు..
నిందితుడు సత్యంబాబుకు ఆయేషాకు అసలు పరిచయం కూడా లేదని తేలింది. రెండో అంతస్తు వరండాలో ఉన్న గ్రిల్కు తాళం వేసి ఉన్నా నిందితుడు ఎలా పైకి వచ్చాడనేది పోలీసు దర్యాప్తులో తేలలేదు. సత్యం బాబును అరెస్టు చేసినందుకు నందిగామ కానిస్టేబుల్కు నాడు ఒకేసారి ఏఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చారు.
ఏడో తరగతి ఆపేసి సత్యంబాబు ఇలా..
సత్యంబాబు ఏడో తరగతితో చదువు ఆపేసి, తాపీ పనులు చేస్తుండేవాడు. ఆయన తల్లి మరయమ్మ, తండ్రి వెంకయ్య, సోదరి సత్యమ్మలతో కలిసి గ్రామంలోని పూరిగుడిసెలో ఉండేవాడు. 2008 ఆగస్టులో సత్యంబాబును నందిగామ పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అయేషా హత్యతోపాటు, నందిగామలో బాలికల హాస్టళ్లలో ప్రవేశించి, మహిళలపై దాడులకు, లైంగిక వేధింపుల కేసుల్లో అతను నిందితుడంటూ అరెస్టు చేశారు.
సోదరే అంత్యక్రియలు చేసింది...
సత్యంబాబు జైలు పాలైన తర్వాత అతని కుటుంబం చెప్పనలవి కాని బాధలకు గురైంది. సత్యంబాబు జైలు పాలైన కొద్దినెలలకే అనారోగ్యంతో అతని తండ్రి మరణించాడు. సత్యంబాబును జైలు నుంచి పంపకపోవడంతో అంత్యక్రియలను అతని సోదరి నిర్వహించారు. తల్లి మరియమ్మ కూలి పనులకు వెళ్తూ కూతురిని నర్సింగ్ కోర్సు చదివించారు. ఇపుడు ఆమె నందిగామలోని ఓ ఆసుపత్రిలో పని చేస్తున్నారు.