బీఎస్సీ స్టూడెంట్ కి బీకాం సర్టిఫికెట్:ఆంధ్రా యూనివర్శిటీ నిర్వాకం
విశాఖపట్నం:గతంలో బికాంలో ఫిజిక్స్ చదివానన్న ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చెబితే అందరూ నవ్వుకున్నారు. అయితే ఎపిలోని ఒక ప్రతిష్టాత్మక యూనివర్శిటీ నిర్వాకం చూస్తే ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమని నిరూపించేలాగానే ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే?...
తమ యూనివర్శిటీ పరిధిలో బీఎస్సీ చదవిన ఒక విద్యార్థికి బీకాం ఒరిజినల్ డిగ్రీ ఇచ్చింది ఆంధ్రా విశ్వవిద్యాలయం. అయితే ఇంత పెద్ద తప్పు చేసి కూడా సరిదిద్దుకునేందుకు ప్రయత్నించక ఆ విద్యార్థి భవిష్యత్తుతో ఆటలు ఆడుతోంది. అయితే మరోవైపు ఎయు నిర్వాకం తెలుసుకున్న మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా విసిని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే...
శ్రీకాకుళం జిల్లాకు చెందిన అట్టాడ శ్రీహరి అనే విద్యార్థి టెక్కలి బీఎస్ అండ్ జేఆర్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సీబీజెడ్ కోర్సు పూర్తి చేశాడు. దీంతో 2015లో డిగ్రీ పట్టా కూడా చేతికొచ్చింది. దాన్ని చూసి ఎంతో సంతోషించిన ఆ యువకుడు ఆ తరువాత అందులోని వివరాలు చూసి ఖంగు తిన్నాడు. కారణం...బిఎస్సీ విద్యార్థి అయిన అతడి సర్టిఫికెట్ పై బ్యాచిలర్ ఇన్ కామర్స్ అని ఉంది. అయితే మార్కుల వివరాల వద్ద సైన్సు సబ్జెక్టులుగానే పేర్కొన్నారు.
దీంతో జరిగిన పొరపాటు గురించి అతడు వెంటనే తాను చదివిన కాలేజ్ యాజమాన్యాన్ని సంప్రదిస్తే...సర్టిఫికెట్ తో తమకేం సంబంధం లేదని, విశాఖపట్టణం వెళ్లి ఆంధ్రా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాలల్సిందేనని సూచించారు. దీంతో ఆ యువకుడు వర్సిటీ అధికారులను కలిసి జరిగిన పొరపాటు గురించి వివరిస్తే వాళ్లు దాన్ని చాలా తేలికగా తీసుకొని ఓహో ఆ విధంగా పొరపాటు జరిగిందా...ఏం ఫరవాలేదు మార్చేద్దామని భరోసా ఇచ్చారు. అయితే వారి భరోసా భరోసా గానే మిగిలి పోయింది తప్ప మూడేళ్లుగా తిరుగుతున్నా ఆ విద్యార్థి సర్టిఫికెట్ లో అవసరమైన ఆ మార్పు మాత్రం చేయనే లేదు.
ఈ మధ్య కాలంలో ఉద్యానవనశాఖలో అవుట్ సోర్సింగ్ కు బిఎస్సీ క్వాలిఫికేషన్ కాగా శ్రీహరి ఆ ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకున్నాడు. అయితే సర్టిఫికెట్లో తప్పు కారణంగా వెరిఫికేషన్లో ఇతని డిగ్రీ పట్టా తిరస్కరణకు గురైంది. బీఎస్సీ అని చెప్పి బీకామ్ సర్టిఫికెట్ ఎలా పెట్టావని సంబంధిత అధికారులు శ్రీహరి పైనే ఫైర్ అయ్యారు. తాను చదివింది బిఎస్సీ నేనని...బికాం అని తప్పు ప్రింట్ అయిందని..కావాలంటే సబ్జక్టులు చూడాలని అతడు ఎంత బ్రతిమలాడినా సర్టిఫికెట్ లో ఏముందో అదే ప్రధానమంటూ అధికారులు ఆ ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించారు.
మరోవైపు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదువుకున్న విద్యార్థికి బీకామ్ పట్టా ఇవ్వడంపై మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఆంధ్ర వర్సిటీ విసితో ఆయన మాట్లాడారు. బీఎస్సీ చదివిన విద్యార్థికి బీకామ్ పట్టా ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారని తెలిసింది. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, పట్టా ఇచ్చిన బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన వీసీని ఆదేశించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని హితవు పలికారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులను విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.