సచివాలయంలో బ్యాటరీ ఆటోలు:లక్షలు పోసి కొని...పక్కన పడేశారు...
అమరావతి: ప్రజాధనం అంటే కొందరు అధికారులకు ఏమాత్రం లెక్కలేదనడానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వచ్చే సందర్శకుల సౌకర్యార్థం అంటూ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఆధునిక ఆటో రిక్షాలు...కారణాలేమైనప్పటికి ప్రారంభించిన కొద్ది నెలలకే పనికిరాకుండా పోయాయి. దీంతో లక్షలాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారినట్లయింది.
ఎపి సెక్రటేరియట్ కు వివిధ పనుల నిమిత్తం వచ్చే ఉద్యోగులు, వృద్ధులు, చిన్నారులు, మహిళలు, దివ్యాంగులు, సందర్శకుల సౌకర్యార్థం వెలగపూడి సచివాలయంలో ఎపి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన బ్యాటరీ ఆటోలు ఏడాదిలోపే మూలనపడ్డాయి. సరైన పర్యవేక్షణ లేక మరమ్మతులకు గురైన ఈ ఆటోలను ప్రత్యేకంగా పట్టించుకొని రిపేర్ చేయించే వారెవరూ లేకపోవడంతో పనికిరాని స్థితిలో ఓ పక్కన పడి ఉన్నాయి.
ఈ ఆటో రిక్షా ఖరీదు ఎంతో బైటకు వెల్లడించకపోయినా లక్షల ఖరీదు చేసే ఈ ఆటోలు లక్షణంగా తిరగడం మానేసి, దుమ్ముకొట్టుకొని శిధిలావస్థకు చేరుతున్నట్లు కనిపిస్తున్నాయి. సచివాలయంలో పూర్తిస్థాయి పాలన ప్రారంభమైన తరువాత ఇక్కడకు వచ్చే సిఆర్డీఏ అధికారులు, ఉద్యోగులు, సందర్శకులను గేటు దగ్గర నుంచి లోపలికి తీసుకొచ్చేందుకు అధునాతన 12 బ్యాటరీ ఆటోలను ఏర్పాటుచేశారు. అందులో 11 సీట్ల ఆటోలు నాలుగు కాగా, నాలుగు సీట్ల ఆటోలు 8 ఉన్నాయి. అయితే ఈ 12 ఆటోల్లో ప్రస్తుతం 2 పెద్ద ఆటోలు, 2 చిన్న ఆటోలు మాత్రమే సచివాలయంలో తిరుగుతూ కనిపిస్తున్నాయి. మిగిలిన 8 ఆటోలు సచివాలయం బ్లాకుల వెనుక మూలన పడిన స్థితిలో దర్శనమిస్తున్నాయి.
అదేంటంటే...అవన్నీ రిపేరు కొచ్చాయనే సమాధానం ఎదురవుతోంది. సరైన నిర్వహణ,పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం తమ కోసమేనంటూ ప్రవేశపెట్టిన ఈ ఆటోలు మూలన పడ్డ కారణంగా దివ్యాంగులు, వృద్ధులు సచివాలయ గేటు దగ్గర నుంచి లోపలికి నడుచుకుంటూ అంత దూరం రావడానికి నానా అవస్థలు పడుతున్నారు. పైగా ఇప్పుడు నడుస్తున్న నాలుగు ఆటోలు కూడా ఏదో పేరుకే నడుపుతున్నట్లుంది తప్ప నిజంగా సందర్శకుల సౌకర్యార్థం నడుపుతున్నట్లు లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సిఆర్డిఎ అధికారులను అడిగితే ఈ ఆటోలది కొత్త టెక్నాలజీ కావడంతో మరమ్మతులు చేసే వారు అందుబాటులో లేరని, అయితే త్వరలోనే అన్నిఆటోలను రిపేరు చేసి, అందుబాటులోకి తెస్తామని అంటున్నారు.