చంద్రబాబుతో బీజేపీ ఎమ్మెల్యే భేటీ:ఈయన మాజీ మంత్రి కూడా!...కలిసింది ఎందుకంటే?...
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కలసి సమావేశం అవడం చర్చనీయాంశంగా మారింది.
అయితే కామినేని శ్రీనివాస్ సిఎం చంద్రబాబును కలవడం వెనుక రాజకీయ పరమైన కారణాలు లేవని అంటున్నారు. జీతాలు పెండింగ్ లో ఉన్న ఒక శాఖ ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం వారి తరుపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన ఒక విజ్ఞప్తిని సిఎం చంద్రబాబు పరిశీలించి సానుకూలంగా పరిష్కరించారట. ఈ నేపథ్యంలో మేలు పొందిన ఉద్యోగులతో కలసి సిఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అమరావతి వచ్చినట్లు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే...
విద్యాశాఖలోని దాదాపు 1000 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాలు కొన్ని నెలలగా పెండింగ్లో ఉండడంతో వారు తమ సమస్య పరిష్కారం కోసం బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ను ఆశ్రయించారట. దీంతో స్పందించిన కామినేని శ్రీనివాస్ ఇటీవలే సీఎం చంద్రబాబును కలసి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారట.

మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ద్వారా విద్యా శాఖలో ఉపాధ్యాయుల వేతనాల పెండింగ్ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని పిలిచి సమస్య ఏమిటో తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలని...ఆ ఉద్యోగులకు జీతాలు పడేలా చేయాలని గట్టిగా ఆదేశాలు జారీచేశారట. దీంతో ఆ జీతాల పెండింగ్ ఫైల్ ఆఘమేఘాల మీద నడిచి జీతాల బకాయిలు విడుదల అయ్యాయట.
సీఎం చంద్రబాబు చొరవతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న తమ జీతాలు సత్వరమే చేతికి అందడంతో ఎంతో సంతోషించిన ఉపాధ్యాయులు సిఎం చంద్రబాబును కలసి కృతజ్ఞతలు తెలపాలని భావించారట. వారి వినతి మేరకు మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వారితో పాటు సోమవారం సచివాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వీరంతా సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలపడంతో పాట తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం అయ్యేలా కృషి చేసిన మాజీ మంత్రి కామినేనికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారట.












Click it and Unblock the Notifications