"ఎపిని మళ్లీ ముక్కలు చేస్తారా: తెలుగు దెబ్బకు గుజరాత్లో దాక్కోవాలి"
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు భగ్గుమన్నారు. కేంద్రం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కర్ణాట, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించి జరిగిన అన్యాయంపై ప్రచారం చేస్తామని హెచ్చరించారు.
తమ ప్రచారం ద్వారా బిజెపికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసేలా చేస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామిల అమలును కోరుతూ గుంటూరులో గురవారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు.
మరోసారి ముక్కలు చేసేందుకు..
రాష్ట్రాన్ని మరోసారి ముక్కలు చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విమర్శించారు. సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఆ విధమైన విషప్రచారాలు చేస్తే తెలుగువారు కొట్టే దెబ్బలకు గుజరాత్లో దాక్కోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
తెలుగువారి జనాభా 13 కోట్లు...
దేశవ్యాప్తంగా తెలుగువారి జనాభా 13 కోట్ల దాకా ఉందని, వారంతా బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చలసాని శ్రీనివాస్ అన్నారు. విశ్వవిద్యాలయాల విద్యార్థులు తరగతులకు ఇబ్బంది లేకుండా ఉద్యమంలోకి రావాలని, మొదటి వారంలో రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో చేసే పోరాటం చూసిన తర్వాత తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.
మంత్రి సమాధానం చెప్తాం..
ఆంధ్రప్రదేశ్ అంటే వెంట్రుకతో సమానమని వ్యాఖ్యానించిన మంత్రికి ఎలా సమాధానం చెప్పాలో రాష్ట్ర ప్రజలకు తెలుసునని చలసాని శ్రీనివాస్ అన్నారు. మార్చి 5వ తేదీ నుంచి 9వ తేదీ వకు ప్రత్యేక కార్యాచరణ, 15వ తేదీ తర్వాత తవ్రమైన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు.
ఇప్పుడే స్పష్టత రావాలి
ప్రత్యేక హోదాపై ఈ పార్లమెంటు సమావేశాల్లోనే స్పష్టత రావాలని, లేకపోతే మోడీ ఉన్నంత కాలం నకు అన్యాయమే జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. రూపం ఏదైనా కేంద్రంపై ఒత్తిడి తేవడమే అన్ని పక్షాల నిర్ణయంగా ఉండాలని సిపిఎం కార్యదర్శి మధు అన్నారు.
చంద్రబాబు ఇలా...
ప్రత్యేక హోదా సాధన సమితి ఇప్పటికే విజయం సాధించిందని, హోదా అవసరమే లేదని అన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పడు అది కావాలని చెప్పడం విజయమే అని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రికి, ప్రధానికి మధ్యయ ఉన్న అభిప్రాయ భేదాల కారణంగానే రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని వైసిపి ఎమ్మల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.