బిపివో స్టాఫర్: వైజాగ్ నుంచి ఆపరేషన్, బెజవాడలో బ్యాంక్ లావాదేవీలు
హైదరాబాద్: తక్కువ వడ్డీకే ఎక్కువ రుణాలు, 48 గంటల్లో క్లియర్ అంటూ అమాయకులను నమ్మించి వేలాది రూపాయలు కాజేసిన ఓ బిపివో స్టాఫర్ను సైబరాబాద్ పోలీసులు పట్టేశారు. అతడ్ని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను సోమవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పట్టణానికి చెందిన జయంతి శివ స్వరూప్ వైజాగ్లో టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుని మోసాలకు దిగాడు.
‘తక్కువ వడ్డీకి రుణాలు మంజారు చేస్తాం' అని అనేక మంది సెల్ఫోన్లకు సందేశాలు పంపాడు. డబ్బులు అవసరమైన వారంతా ఈ సందేశాలకు స్పందించారు. రుణాలు తీసుకోవడానికి ముందుకు వచ్చిన వారికి మెయిల్ ద్వారా దరఖాస్తులను పంపేవాడు. అనంతరం రుణం మంజూరు, పన్నులు, ఇతర చార్జీల రూపంలో వేలాది రూపాయలను బ్యాంక్ ఖాతాలో జమ చేయించుకునేవాడు. ఈ విధంగా నాగోలుకు చెందిన కేఎల్కే రెడ్డికి 8008791650 నంబర్తో ఆగస్టు నెలలో ఏడీఎన్ ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో సందేశం పంపాడు. దీంతో ఆయన స్వరూప్తో ఫోన్లో మాట్లాడాడు.
‘ఇది ముంబై ఆఫర్. ఐదు శాతం వడ్డీకి 48 గంటల్లో రుణం మంజూరు చేస్తాం. మీ భూమికి సంబంధించిన దస్తావేజులను రుణం ఆమోదానికి మాకు పంపండి' అని చెప్పాడు. అందుకు అతనో మెయిల్ను కూడా సృష్టించాడు. కెఎల్కె రెడ్డి దస్తావేజులను పంపిన కొన్ని రోజులకు 9966846335 నంబర్తో ఫోన్ చేశాడు. ‘మీ దస్తావేజులను పరిశీలించి 45 లక్షల రూపాయల రుణం మంజూరు చేస్తున్నాం' అని చెప్పాడు. ఇందుకు చార్జీలుగా 22,500, ఇన్సూరెన్స్ కోసం 25 వేల రూపాయలను ఎస్బీఐ ఖాతా 20189424877 నంబరులో జమ చేయాలని చెప్పాడు.
బాధితుడు డబ్బులు జమ చేసిన తర్వాత సెల్నంబర్లను స్విచ్ఛాఫ్ చేయడంతో పాటు మెయిల్ను రద్దు చేసుకున్నాడు. ఇలా అనేక మందికి టోకరా వేశాడు. ప్రజల నుంచి డబ్బులు జమ చేయించుకోవడానికి నకిలీ ఆధార్ కార్డును తయారు చేసుకుని విజయవాడ, ఎంజీరోడ్డులోని ఎస్బీఐలో ఖాతా తెరిచాడు. ఈ ఖాతాలో డబ్బులు జమ చేయించుకుని విశాఖపట్నం నుంచి ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేసుకునేవాడు.
బాధితుడు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు స్వరూప్ను అరెస్టు చేసి 20 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రెండు సెల్ఫోన్లు, ల్యాప్టాప్, డేటాకార్డు, రెండు నకిలీ ఆధార్ కార్డులను సీజ్ చేశారు. నకిలీ పేరుతో ధ్రువీకరణపత్రాలు సమర్పించిన కేసులో గత ఏడాది ఎల్బీనగర్ పోలీసులు స్వరూప్ను అరెస్టు చేశారు.