ఎపి రేషన్ షాపుల్లో బ్రౌన్ రైస్?...ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన!
అమరావతి:ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న ఒక అంశానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాలక్రమంలో మారిన ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణమో లేక మరోటో తెలియదు గాని ప్రజల్లో డయాబెటీస్,స్థూలకాయం పేషెంట్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రమాదకరమైన ఈ రెండు వ్యాధుల నియంత్రణకు తన వంతు తోడ్పటును అందించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆహార అలవాట్ల ద్వారా చాలావరకు ఈ వ్యాధులను కంట్రోల్ చేసే అవకాశం ఉండటంతో ఎపి ప్రభుత్వ అధికారులు ఆ దిశలో చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన బ్రౌన్ రైస్ ను రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తే బాగుంటుందంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
అధికారుల ఆలోచన ప్రకారం రేషన్ షాపుల ద్వారా సాధారణ బియ్యంతోపాటుగా పాలిష్ చేయని ముడి బియ్యం(బ్రౌన్ రైస్)ను సరఫరా చేద్దామంటూ అధికారులు ఎపి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. పౌరసరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్యఆరోగ్య శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని విరివిగా అమలు చేసి ప్రజల ఆరోగ్యం మెరుగుపడేలా కృషిచేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. చాలా అనారోగ్య సమస్యలకు మన తీసుకునే ఆహారమే కారణమవుతోందని, అందువల్ల పౌరసరఫరా శాఖ ఈ విషయంలో కీలక భాగస్వామ్యం చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
ఈమేరకు ఆయా శాఖల అధికారులు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలోనూ ఈ ప్రతిపాదన గురించి చర్చించడం జరిగిందట. ఆశ్చర్యంగా మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారిలోనూ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ఈ సదస్సులో ప్రస్తావించినట్లు తెలిసింది. అంతేకాదు ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల్లో కూడా మధుమేహం ఎక్కువగానే ఉన్నట్లు నిర్ధారణయ్యిందని వైద్యశాఖాధికారులు నివేదించారు.మన స్థానిక ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువగా పాలిష్డ్ అన్నం ఎక్కువగా తినడం వల్ల శరీరానికి కావాల్సిన కార్బొహైడ్రేట్లు అందాల్సిన పరిమితి కంటే ఎక్కువ మోతాదులో లభించడం, అలాగే శారీరక శ్రమ బాగా తక్కువైపోవడం కూడా ఈ రెండు సమస్యలు బాగా ప్రబలడానికి కారణమని వైద్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అందువల్ల పాలిష్డ్ రైస్ స్థానంలో పాలిష్ చేయని బియ్యాన్ని తీసుకుంటే ఈ సమస్యలను కొంతవరకు అధిగమించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నిర్ణయమై మరికొందరు అధికారులు ప్రతిస్పందిస్తూ ముడి బియ్యంతో పాటు ప్రత్యామ్నాయంగా జొన్నలు, రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలను కూడా పంపిణీ చేస్తే బాగుంటుందని పలువురు వైద్యశాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల రేషన్ ద్వారా చిరుధాన్యాలు పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరా శాఖ అధికారులు ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
మరోవైపు చిన్నారుల్లో కూడా జీవన శైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల చాలా మంది వయసుకు మించిన బరువు తూగుతూ ఒబేసిటీతో భాధపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 28.81 లక్షల మంది పిల్లలు ఇలా తమ వయసుకు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువుతో ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియచేస్తున్నాయి. పిల్లలకు సంబంధించి కేవలం ఆహారపు అలవాట్లే కాకుండా ఆటలకు దూరంగా ఉండటం వల్ల కూడా వీరిలో స్థూలకాయం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు తెలిపారు.మరోవైపు రేషన్ షాపుల్లో బ్రౌన్ రైస్ పంపిణీ చేయాలన్న అధికారుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.