అధికారం లేదు కానీ: బస్సు ప్రమాదంపై శివాజీతో బొత్స!
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా బస్సు ప్రమాద బాధితుల డిమాండ్లు తీర్చే అధికారం తనకు లేదని అయితే, తన పరిధిలో న్యాయం చేస్తానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం చెప్పారు. ప్రముఖ తెలుగు హీరో శివాజీ నేతృత్వంలో పాలెం బస్సు ప్రమాద బాధితులు ఉదయం బొత్సను కలిశారు.
ఈ సందర్భంగా శివాజీ, ప్రమాద బాధితులు మాట్లాడుతూ.. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఘటనకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రు.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. అనంతరం బొత్స మాట్లాడారు.
ఎక్కడ సంఘటన జరిగినా దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పర్మిట్లు దుర్వినియోగం చేస్తున్న ట్రావెల్సు పైన తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పాలం ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిజిపికి చెప్పామన్నారు. బస్సు దివాకర్ ట్రావెల్సుదే అన్నారు.
బాధితుల డిమాండ్లు తీర్చే అధికారం తనకు లేదని అయితే, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి తన పరిధిలో న్యాయం చేస్తానని చెప్పారు. ఎక్స్గ్రేషియా, ఉద్యోగాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రెండు రోజుల్లో లేఖ రాస్తానని చెప్పారు. బస్సు యజమానిపై చర్యలు తీసుకునే అధికారం ఆర్టీఏకి లేదని చెప్పారు. దుర్ఘటనపై సిబిసిఐడి దర్యాఫ్తు చేస్తోందన్నారు.
ఓ మీడియా సంస్థపై ఆగ్రహం
ఈ సందర్భంగా బొత్స ఓ మీడియా సంస్థ పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. బస్సు ప్రమాదం జరిగినప్పుడు స్పందించని ఓ ఛానల్ ఇప్పుడు అతిగా స్పందిస్తోందని విమర్శించారు. ఏదో అజెండాతో తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రిని కలుస్తాం: బాధితులు
తమకు న్యాయం చేస్తామని బొత్స హామీ ఇచ్చారని, సంక్రాంతిలోగా సమస్య పరిష్కరించకుంటే తాము ముఖ్యమంత్రిని కలుస్తామని బాధితులు చెప్పారు.