నిగ్గు తేలనున్న బాబు వాయిస్: సిబిఐకి అప్పగించాలని పిటిషన్
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో ఆడియో, వీడియో టేపుల డీకోడింగ్ను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) ప్రారంభించినట్లు సమాచారం. దాంతో ఆడియో టేపులోని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గొంతు అవునా, కాదా అనేది తేలనుంది. నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్తో చంద్రబాబు నేరుగా మాట్లాడినట్లు గల ఓ ఆడియో టేప్ లీకైన విషయం తెలిసిందే.
డీకోడింగ్ కోసం ప్రత్యేకంగా ఎఫ్ఎస్ఎల్ మూడు బృందాలను ఏర్పాటు చేసింది. మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఇటీవల ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించిన విషయం తెలిసిందే.
వాటిని విడిగా కాపీచేసి, వాటిలోని వాస్తవాలను తేల్చేందుకు ఎఫ్ఎస్ఎల్ సిద్ధమైంది. ఇందుకు ఏర్పాటు చేసిన మూడు బృందాలు కూడా ఇప్పటికే తమ పనిని ప్రారంభించాయి. తన ఫోన్ను ట్యాప్ చేశారని ఒకసారి, వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్టు చేసి టేప్ తయారు చేశారని మరోసారి చంద్రబాబు అంటూ వచ్చారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడదు రేవంత్రెడ్డి కేసును సీబీఐకు అప్పగించాలంటూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. హైకోర్టుకు చెందిన సీనియర్ లాయర్ పీవీ కృష్ణయ్య ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో వాస్తవాలను రాబట్టాల్సిన అవసరం ఉన్నందున సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్లో కోరారు.