రూ.2వేలకు చిల్లర దొరకట్లేదు, ఆ కలెక్టర్ ఏం చేశాడంటే: కరెన్సీ గందరగోళంపై బాబు
అమరావతి: రూ.2000 నోటుకు చిల్లర దొరకడం లేదని, అయితే పెద్ద సంస్కరణలు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయని, సామాన్యులు ఇబ్బంది పడకూడదనే ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.
ప్రజలు రూ.2 లక్షల 50వేల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిపాజిట్ చేయవచ్చునని చెప్పారు. ఆన్ లైన్ లావాదేవీల పైన ఎలాంటి పరిమితులు లేవని చెప్పారు. ప్రజలు ఇబ్బంది పడకుండా బ్యాంకులు చూడాలని హితవు పలికారు.
ఏపీలో ఇవాళ కూడా బ్యాంకులు పని చేస్తున్నాయని చెప్పారు. సెలవు రోజు కూడా పని చేస్తున్నందుకు బ్యాంకులను అభినందిస్తున్నానని చెప్పారు. జిల్లాస్థాయిలో అధికారులు, బ్యాంకర్లతో సమన్వయంగా పని చేస్తున్నారన్నారు. బ్యాంకుల్లో క్యూ లైన్ ఎక్కువగా ఉంటే స్లిప్పుల వ్యవస్థ పెట్టాలని సూచించామన్నారు.
బ్యాంకుల్లో క్యూలైన్లలో నిలుచున్న వారికి మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. ఖాతాలా డబ్బులు ఉన్నా ఉపసంహరణకు ఇబ్బందులు పడవలసి వస్తోందన్నారు. రూ.2వేల నోటుకు చిల్లర దొరికే పరిస్థితి లేదన్నారు. కంట్రోల్ రూం నుంచి సమీక్షిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ సంస్థలు డిజిటల్ చెల్లింపులను స్వీకరించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, చెక్కుల ద్వారా చెల్లింపులు చేయవచ్చన్నారు. నల్లధనం పెద్ద సమస్య అని, పాత కరెన్సీని రద్దు చేసినా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. ఇది అతిపెద్ద సంస్కరణ అన్నారు.
టోకెన్లు ప్రవేశ పెట్టిన ప.గో. కలెక్టర్
ఇలాంటి సంస్కరణ వల్ల బ్లాక్ మనీ ఉన్న వారు ఇబ్బంది పడితే ఎలాంటి సమస్య లేదన్నారు. కానీ ప్రజలు కూడా ఇబ్బంది పడవద్దన్నారు. వాటి పైన దృష్టి సారిస్తున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ రైతు బజారులో రూ.100, రూ.50 టోకెన్ వ్యవస్థను ప్రవేశ పెట్టారని చంద్రబాబు చెప్పారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు వల్ల ఏపీకి నష్టపోయిన విషయమై ఇంకా చూడలేదన్నారు.
తనకు తెలుసంటున్నారు..
రూ.500, రూ.1000 నోట్ల రద్దు గురించి తనకు ముందే తెలుసునని కొందరు చెప్పడం విడ్డూరమని చంద్రబాబు అన్నారు. నేను నాలుగేళ్లుగా ఈ నోట్లు రద్దు చేయాలని కోరుతున్నానని చెప్పారు. ఇప్పటికి అమల్లోకి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు బ్యాంకుల్లో రూ.6700 కోట్లు డిపాటిజ్ అయ్యాయన్నారు. అందులో రూ.4వేల కోట్లు రూ.2వేల నోట్లే ఉన్నాయని చెప్పారు.
ఇంట్లో కూరగాయలు ఉన్నాయి
ఓట్ల రద్దు గురించి తమకు ముందస్తు సమాచారం లేదన్నారు. ముందు తెలిసినా ఎవైరనా రూ.ఐదారు లక్షలు మాత్రమే మార్చుకోగలరన్నారు. మీ వ్యక్తిగత ఖర్చుల కోసం ఎంత డబ్బు మార్చారని మీడియా ప్రశ్నించగా.. తనకు కారు డీజిల్ ప్రభుత్వం భరిస్తుందని, ఇంట్లో సరిపడా కూరగాయలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు.
సహజమే
రూ.500, రూ.1000 నోట్ల రద్దును ముందే చెబితే ప్రజలు ఇబ్బందిపడకపోయేవారు కదా అని ఓ విలేకరి ప్రశ్నించారు. దానికి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఓ సంస్కరణ తెచ్చినప్పుడు అలా కుదరదని చెప్పారు. సంస్కరణలతో తొలుత ఇబ్బందులు సహజమే అన్నారు.
ఏపీలో నిత్యావసర వస్తువులు ఎక్కడా పెరగలేదన్నారు. పెరగడం లేదన్నారు. ఎక్కడైనా పెరిగితే చెప్పాలని, వారిపై పీడీ యాక్ట్ కింద కేసు పెడతామన్నారు. మీడియా కూడా దీనిపై ప్రజలను భయాందోళనకు గురి చేయవద్దన్నారు.