వెనక్కి తగ్గిన చంద్రబాబు: బాక్సైట్ మైనింగ్ జీవో రద్దు, వైఎస్పై నిందలు
హైదరాబాద్: బాక్సైట్ సరఫరా కోసం 2008లో జారీ చేసిన జీవో 222 ఉత్తర్వులను, దానికి అనుగుణంగా చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాక్సైట్పై వైఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత వైఎస్ ప్రభుత్వం గిరిజనుల వాదన వినకుండా ఏకపక్షంగా వ్యవహరించి తమ వారికి బాక్సైట్ ఖనిజాలను కట్టబెట్టిందని ఆరోపించారు.
ప్రజలతో సమగ్రంగా చర్చించిన తర్వాతే తమ ప్రభుత్వం బాక్సైట్పై తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మంగళవారం శాసనసభలో బాక్సైట్పై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. గిరిజనులు ఎప్పటికీ ఆకులు అలమలు తింటూ జీవించాలా? వారు నాగరికం కావొద్దా? అభివృద్ధి చెందొద్దా? అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన వైఎస్ స్వలాభం, స్వప్రయోజనాల కోసం ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు.
తొలుత జిందాల్ కంపెనీకి 25 లక్షల టన్నులను రూ.9 వేల కోట్ల పెట్టుబడుల కోసం సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నారని, కానీ దాన్ని అమలు చేయలేదని తెలిపారు. అనంతరం రస్ అల్ ఖైమా అనే సంస్థను తీసుకొచ్చారని చెప్పారు. దీనిపై అధికారులతో జరిగిన సమావేశంలో రస్ అల్ ఖైమా పరిశ్రమ పెడితే, ప్రభుత్వం ద్వారానే బాక్సైట్ ఇవ్వాలని అప్పటి సీఎస్ ప్రతిపాదించారని వివరించారు. కానీ దాన్ని కొట్టిపారేసిన వైఎస్ జెర్రెల్లాలో వారికి గనులు కేటాయించాలని ఉత్తర్వులు ఇప్పించారని తెలిపారు.
ఆ తర్వాత కాలంలో రస్ అల్ ఖైమాతో పెన్నా ప్రతా్పరెడ్డికి చెందిన పెన్నా గ్రూపు కలిసిందని, రెండూ కలిసి అనరాక్ లిమిటెడ్ను స్థాపించాయన్నారు. 2009లో పెన్నా గ్రూపు, రస్ అల్ ఖైమాల మధ్య వాటాల నిష్పత్తి 70:30గా ఉండగా 2013 నాటికి అది 87:13మారిందని చెప్పారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అసలు కంపెనీకి వాటా తగ్గించి, మధ్యలో వచ్చిన పెన్నా గ్రూపునకు వాటా పెంచేలా వైఎస్ కుట్ర చేశారని ఆరోపించారు.
పెన్నా గ్రూపునకు వాటా పెంచినందుకు ఫలితంగా జగనకు చెందిన జగతి పబ్లికేషన్స్ సంస్థలోకి పెన్నా, కార్మెల్ ఏషియాల నుంచి పలు దఫాలుగా రూ.68 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇదంతా క్విడ్ప్రోకో అని స్పష్టంగా అర్థమవుతోందని చంద్రబాబు తెలిపారు. అంతా తమకు అనుకూలంగా ఉండేలా ఒప్పందాలు చేసుకుని, షరతులు విధించారని తెలిపారు.
వచ్చే మంత్రివర్గ సమావేశంలో నూతన ఇసుక పాలసీ తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రస్తుత ఇసుక విధానం సరిగా లేదని ఆయన అంగీకరించారు. చిన్న చిన్న ఇసుక రీచ్లను స్థానికులకే ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు.