గవర్నర్పై వద్దు: బాబు క్లాస్, సుంకేశుల పేల్చేస్తామంటే జగన్ ఎక్కడ: రావెల
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు, నేతలకు సూచించారు. గవర్నర్ పైన ఏపీ మంత్రులు, నేతలు ఘాటుగా స్పందిస్తున్న విషయం తెలిసిందే.
మంత్రి అచ్చెన్నాయుడు గంగిరెద్దు అని విమర్శించి, తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పైన హద్దులు మీరవద్దని బాబు వారికి సూచించారు.
సుంకేశులను పేల్చేస్తాంటే ఏమైంది: జగన్కు రావెల
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సుంకేశులను పేల్చేస్తామంటే వైసీపీ అద్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పౌరుషం ఏమైందని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రశ్నించారు. జగన్ తీరు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కనిపిస్తోందన్నారు.
రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానం కంటే జగన్కు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని మండిపడ్డారు. తెరాసలోకి ఇద్దరు ఎమ్మెల్యేలను పంపిన జగన్, మూడో ఎమ్మెల్యేను కానుకగా ఇచ్చారని ఎద్దేవా చేశారు.
తెరాసతో జగన్ చేతులు కలపడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. స్టీఫెన్ సన్ను ఎమ్మెల్యేగా చేయాలని రికమండ్ చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు.
గవర్నర్ను అవమానించారన్న వ్యాఖ్యల పైన రావెల స్పందించారు. గవర్నర్ను తమ మంత్రులు అవమానించేలా వ్యవహరించలేదని చెప్పారు. రాజ్ భవన్ వెళ్తే తమ మంత్రులకే అవమానం జరిగిందన్నారు. వేలు చూపించి మరీ అవమానించారన్నారు.
నారాయణకు తప్పిన ప్రమాదం
మంత్రి నారాయణకు తృటిలో ప్రమాదం తప్పింది. గోదావరి పుష్కరాల పనులను సమీక్షఇంచేందుకు ఆయన రాజమండ్రి చేరుకున్నారు. ఉదయం పనుల పర్యవేక్షణలో భాగంగా వై జంక్షన్ నుంచి కాన్వాయ్ వెళ్తుండగా.. ఓ ఇసుక లారీ అకస్మాత్తుగా కారువైపు దూసుకొచ్చింది. నారాయణ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ అప్రమత్తంతో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.