'చంద్రబాబు ప్రభుత్వానికి గండం' : ఫలితం అనుభవించక తప్పదంటున్నారు..
విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని పరిధియైన విజయవాడలో ప్రభుత్వం చేపట్టిన విస్తరణ పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విస్తరణ పనుల్లో భాగంగా.. పనులకు అడ్డంకిగా మారిన పలు ఆలయాలను ప్రభుత్వం కూల్చివేయడంతో సీఎం చంద్రబాబుకు శాపానార్థాలు పెడుతున్నారు కొంతమంది పీఠాధిపతులు.
తాజాగా ఆలయాల కూల్చివేతపై స్పందించిన శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి సీఎం చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపుగా 40 హిందూ దేవాలయాలను ప్రభుత్వం కూల్చివేసిందన్న వార్తలన్న నేపథ్యంలో స్పందించిన ఆయన.. చంద్రబాబు హిందూ దేవుళ్ల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
1903లో ఏర్పాటైన ఆంజనేయుడి విగ్రహం కూల్చివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన శివస్వామి వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అర్జునుడి కాలం నాటి వినాయకుడి విగ్రహాన్ని కూల్చివేయడాన్ని తప్పుబట్టిన ఆయన, చంద్రబాబు ఇవన్నీ చంద్రబాబు ప్రభుత్వం చేస్తోన్న అపచారాలుగా చెప్పుకొచ్చారు.
ఇక రాహు కేతువుల ఆలయాలను కూలగొట్టి చంద్రబాబు తీవ్ర తప్పిదం చేశారని ఆరోపించిన ఆయన, రాహు కేతువులతో పెట్టుకున్నవారెవ్వరూ బాగుపడరని, చంద్రబాబు కూడా దాన్నుంచి తప్పించుకోలేరని మండిపడ్డారు. కూల్చివేతల ప్రభావం చంద్రబాబు ప్రభుత్వంపై ఉంటుందని చెప్పిన ఆయన, కూల్చివేతలు చంద్రబాబు ప్రభుత్వానికే గండం అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఆలయాల కూల్చివేత విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం విజయవాడలో భారీ ర్యాలీ చేపట్టబోతున్నట్టుగా తెలిపారు పీఠాధిపతి శివస్వామి. ఇక చంద్రబాబును మహమ్మదీయ రాజులతో పోల్చిన శివస్వామి.. చరిత్రలో గజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మద్ వంటి వారు ఆలయాల కూల్చివేతకు పాల్పడితే ఇప్పడు చంద్రబాబు కూడా అదే తోవలో వెళ్తున్నారని ఆరోపించారు.
చివరగా, చంద్రబాబు ప్రభుత్వానికి శాపానార్థం పెట్టిన శివస్వామి దేవుళ్లపై దండయాత్ర చేస్తోన్న చంద్రబాబుకు దాని తీవ్రత ఏంటో తెలిసిరాక తప్పదని, ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించి తీరుతారని శపించారు.