"చెత్త రోడ్లు - చెత్త ముఖ్యమంత్రి": జగన్ లక్ష్యంగా జనసేన బాటలో టీడీపీ డిజిటల్ వార్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల సమస్యపై మరోమారు తెలుగుదేశం పార్టీ అధికారి వైసీపీని టార్గెట్ చేస్తుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి మూడేళ్ల పాలనలో వైసీపీ హయాంలో రోడ్లు దారుణంగా తయారయ్యాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. గుంతల మాయమైన రోడ్లలో ప్రజలు ప్రయాణం చేయాలంటే నిత్య నరకం చూస్తున్నారంటూ ఇప్పటికే అనేక మార్లు రోడ్ల సమస్యలు పరిష్కరించాలని టిడిపి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇక తాజాగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో రోడ్లు లేకుండా పోయాయని, రోడ్లు సిమ్మింగ్ పూల్స్ గా మారాయని టిడిపి విమర్శిస్తుంది. ఇక ఈ క్రమంలోనే రోడ్ల సమస్యపై తెలుగుదేశం పార్టీ డిజిటల్ పోరాటానికి శ్రీకారం చుట్టింది.
తెలుగుదేశం "చెత్త రోడ్లు - చెత్త ముఖ్యమంత్రి" కార్యక్రమం
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల సమస్యపై పోరుబాట పట్టిన టి.డి.పి ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైందని, ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రయాణించవలసి వస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. అయినా జగన్ రెడ్డిలో కాస్తంత కూడా చలనం లేదని విమర్శించింది. అందుకే తెలుగుదేశం "చెత్త రోడ్లు - చెత్త ముఖ్యమంత్రి" కార్యక్రమం చేపట్టిందని వెల్లడించింది. మీ రోడ్డు బాగుపడాలనుంటే మీరు చేయవలసిందల్లామీకు కనిపించిన చెత్త రోడ్డును సెల్ఫీ కానీ, ఫోటో, వీడియో రూపంలో కానీ 7557557744 నంబర్ కు పంపించండి అంటూ ఏపీలో రోడ్ల సమస్యపై ప్రజలను భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తోంది.
రోడ్డుపై ప్రయాణం నరకప్రాయమా? .. అయితే మీ సమస్య కోసమే టీడీపీ పోరాటం అంటూ
రోడ్ల సమస్యపై ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వద్దామని, మన రోడ్డును బాగు చేసుకుందాం అంటూ ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి అంటూ పిలుపునిస్తుంది . టీడీపీ "చెత్త రోడ్లు చెత్త ముఖ్యమంత్రి " డిజిటల్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గుంతల మయం అయిన రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందా? ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు రోడ్డు బాగు పడుతుందనే నమ్మకం మీకు లేదా? అయితే మీకోసం తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనండి అంటూ తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తోంది.
పవన్ కళ్యాణ్ రోడ్ల సమస్యపై పోరాటం .. ఇక టీడీపీ కూడా అదే బాటలో
ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూలై 15 నుంచి మూడు రోజుల పాటు గుడ్ మార్నింగ్ సి ఎం సార్ పేరు తో రోడ్ల సమస్యపై డిజిటల్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా దాడి చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా టిడిపి కూడా రోడ్ల సమస్యపై సమరం చేయాలని నిర్ణయించింది. ఇక ఇదే సమయంలో #ChetthaRoadsChetthaCM తో ట్వీట్ చేయాలని , సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టాలని టిడిపి సూచిస్తుంది.
రోడ్లు స్విమ్మింగ్ పూల్స్ అయ్యాయని గోరంట్ల టార్గెట్
ఇక ఈ క్రమంలోనే టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా వేదికగా జగన్ పాలన లో రోడ్ల దుస్థితిని టార్గెట్ చేశారు. జులై 15 నాటికి రోడ్ల మీద గుంతలు ఉండవు అని డాబు కబుర్లు చెప్పిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ అసలు రోడ్ల మీద గుంతలు కాదు రోడ్లే లేకుండా పోయాయి అంటూ టార్గెట్ చేశారు. తెలుగుదేశం వాళ్ళు సింగపూర్ అనడం తప్ప చేసింది ఏమి లేదు అని చెప్పే వైసిపి నాయకులు సింగపూర్ అనేది పక్కన పెడితే మీ పరిపాలన లో రోడ్లు 'స్విమింగ్ పూల్స్' అయ్యాయి అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో రాష్ట్రం మొత్తం పూల్ కాగా ఫూల్ అయ్యింది మాత్రం ప్రజలు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి టార్గెట్ చేశారు.