పరువు నష్టం దావా వేస్తా: జగన్ సాక్షి పత్రికను ఏకేసిన సిఎం రమేష్
హైదరాబాద్: తనకూ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వర్రావుకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవినేని ఉమ అవినీతిపరుడని నిరూపిస్తే చేస్తే తాను రాజీనామా చేస్తానని వైసీపీ నాయకులు సవాల్ విసిరారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పత్రిక చేసే ప్రతీ ఆరోపణకు తన దగ్గర సమాధానం ఉందని చెప్పారు. ఈ ఆరోపణలపై జగన్ బహిరంగం చర్చకు సిద్ధమవుతాడా అని ఆయన ప్రశ్రించారు. తనపైనా, టీడీపీ ప్రభుత్వంపైనా ఆరోపణలు చేస్తున్న సాక్షి పత్రిక బహిరంగ క్షమాపణలు చెప్పాలని రమేశ్ డిమాండ్ చేశారు. లేదంటే పరువునష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.
ప్రతిపక్ష నేత బాధ్యతను వైయస్ జగన్ మర్చిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్కు తీరిక లేదా అని ప్రశ్నించారు. అయితే డిపాజిట్ కూడా రాని వరంగల్ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లారని విమర్శించారు.
2013లో హైలెవల్ కమిటీకి రాసిన లేఖను ఇప్పుడు రాసినట్టు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. తనకు ఏ మంత్రితోను విబేధాలు లేవని స్పష్టం చేశారు. అయితే దీనిపై కొందరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కారు కూతలు కూస్తున్నారని సీఎం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.