వరంగల్ ఎన్నికే ముఖ్యమా, వరద బాధితులను పట్టించుకోరా: జగన్ను ప్రశ్నించిన సిఎం
హైదరాబాద్/ విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ వరంగల్ జిల్లా మూడు రోజులుగా పర్యటించిన విషయం తెలిసిందే. జగన్ పర్యటనను పర్యటిస్తూ సీఎం రమేష్ - వారం రోజులుగా తీవ్ర వర్షాలతో ఏపీ అతలాకుతలమవుతుంటే ప్రతిపక్షనేత ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. అయినా వరద బాధితులను పట్టించుకోవడం కన్నా జగన్కు వరంగల్ ఉపఎన్నికే ముఖ్యమైందని ఆయన అన్నారు.
తుపాను ప్రాంతాలను పట్టించుకోకుండా వరంగల్లో ఎన్నికల ప్రచారం చేయడం బాధాకరమని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్వాత్రా కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు వరద బాధితుల కోసం ఇన్ని చేస్తున్నా ప్రతిపక్షాలు విమర్శించడం వారి అవివేకానికే నిదర్శనమన్నారు. కనీసం జగన్ సొంత జిల్లాను కూడా పట్టించుకోలేదని, ఇకనైనా కడప జిల్లా ప్రజలు గమనించాలని ఆయన అన్నారు.
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద దెబ్బతిన్న హైవేపై గండి పూడ్చి త్వరలోనే రాకపోకలను పునరుద్ధరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమయంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మీడియాతో ఆయన గురువారం ఆ విషయం చెప్పారు.
త్వరలోనే మనుబోలు వద్ద జాతీయ రహదారిని సరిచేసి రాకపోకలు పునరుద్ధరిస్తామని చెప్పారు. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని గ్రామాలకు రాత్రిలోగా విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారని, వారు ఇచ్చిన నివేదిక ప్రకారం పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని చంద్రబాబు చెప్పారు.