కోస్తాలో కోడిపందేల జోరు: విజేతకు పది కాసుల బంగారు గొలుసు
విజయవాడ: కోస్తాంధ్రలో మూడవ రోజు శనివారం కూడా కోళ్ల పందేల జోరు కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా మరమళ్ల, ముమ్ముడివరం, ఎదుర్లంక, గోడి, గోడిలంక, సఖినేటిపల్లి, జగ్గంపేట, మల్లిశాల, కిర్లంపూడి గ్రామాల్లో మూడో రోజు కోడిపందాలు జోరుగా సాగాయి.
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో కోడిపందాలను బిజెపి నాయకుడు రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. కోడి పందాల్లో విజేతకు 10 కాసుల బంగారు గొలుసు ఇస్తామని రఘురామ కృష్ణంరాజు ప్రకటించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం కొమరవోలులో, భీమడోలు మండలం గుండుగొలను, దెందులూరు మండలం శ్రీరామవరం, ఆకివీడు మండలం ఐ.భీమవరంలో జోరుగా కోడిపందాలు జరిగాయి.
ఉండి మండలం మహదేవపట్నం, పెదవేగి మండలం కొప్పాకలో,లింగపాలెం మండలం ధర్మాజిగూడెం, కామవరపుకోట మండలం కళ్లచెరువులో, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, తణుకు మండలం తేతలిలో కూడా కోడి పందేలు సాగాయి.
ఇదిలావుంటే, గుంటూరు జిల్లా రేపల్లె తీరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలు జోరుగా కొనసాగాయి. గ్రామాల్లోని ప్రజలువేలాది మంది కోళ్ళు పట్టుకుని నియోజకవర్గంలోని చోడాయపాలెంలో పందాలు వేసేందుకు తరలివచ్చారు.
కోడిపందేలను ఎమ్మెల్యేలు అనగాని సత్య ప్రసాద్, నక్కా ఆనందబాబు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, ఎ మ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్లు ప్రారంభించారు. కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని కోడిపందేల రాయుళ్ళు ఒక్కసారిగా గ్రామంలోకి వచ్చి పడ్డారు.
పది వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పందేలు కొనసాగాయి. కార్యక్రమంలో వైస్చైర్మన్ టీకేవీ గుప్త, కృష్ణా పశ్చిమ ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ శరాబంది, రావి సాంబశివరావు, మైనేని వెంకటేశ్వరరావు (పసి), గూడపాటి శ్రీనివాసరావు, అనగాని శివప్రసాద్, జడ్పీ వైస్చైర్మన్ పూర్ణచంద్రరావు, జడ్పీటీసీ సుబ్బారావు పాల్గొన్నారు.