తలనీలాల స్మగ్లింగ్: కుట్రపూరితంగానే టీటీడీపై దుష్ప్రచారం, క్లారిటీ ఇచ్చిన ఈవో ధర్మారెడ్డి
తిరుపతి: ప్రపంచ హిందువుల రాజధాని అయిన తిరుమల తిరుపతి దేవస్థానాలపై కుట్రపూరిత అజెండాతో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ అదనపు ఈఓ ఏ.వి. ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం ఏ.వి. ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
అస్సాం రైఫిల్స్ సీజ్ చేసిన తలనీలాలతో సంబంధం లేదు
మిజోరం-మయన్మార్ సరిహద్దుల్లో కస్టమ్స్ అధికారులు, అస్సాం రైఫిల్స్ సీజ్ చేసిన తలనీలాలతో ఎటువంటి సంబంధం లేకపోయినా, టిటిడిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలోను, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ అవాస్తవాలు ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ధర్మా రెడ్డి అన్నారు. తలనీలాల సీజ్కు సంబంధించి కస్టమ్స్, అస్సాం రైఫిల్స్ అధికారులు స్థానిక పోలీసులకు అందించిన నివేదికను ఆయన మీడియాకు విడుదల చేశారు.
టీటీడీకి సంబంధం లేకున్నా.. అభాసుపాలు చేసేందుకే
టీటీడీ అధికారులు కుమ్మక్కై తలనీలాలను అక్రమ రవాణా చేసినట్టు అభూతకల్పనలు చేశారని అదనపు ఈవో చెప్పారు. టిటిడికి సంబంధం లేని విషయాలపై రుజువులు లేకుండా ప్రచారం చేస్తూ టిటిడి ప్రతిష్టను అభాసుపాలు చేయడానికి ప్రయత్నించడం శోచనీయమన్నారు. దీనివల్ల భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి 8న మిజోరంలో సీజ్ చేసిన రూ.18,17,089/- విలువ చేసే తుక్కు తలవెంట్రుకలకు సంబంధించి అధికారులు పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఎక్కడా టిటిడి పేరే లేదని ఆయన స్పష్టం చేశారు. పైగా సీజ్ చేసిన తలనీలాలు ప్రాసెస్ చేయనివిగా అందులో పేర్కొన్నట్టు తెలిపారు.
18 లక్షల విలువైన వెంట్రుకలను మిజోరాంకు ఎవరైనా తీసుకెళ్తారా?
టిటిడిలో తలనీలాల సేకరణ, వాటి ప్రాసెసింగ్, ఈ-వేలం ప్రక్రియను నిర్వహించడానికి పటిష్టమైన వ్యవస్థ ఉందని, ఇది పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పారు. టిటిడి నుంచి ప్రాసెస్ కాకుండా ఒక్క వెంట్రుక కూడా బయటకు వెళ్లే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కల్యాణకట్ట, విజిలెన్స్ విభాగాల అధికారులు, సుమారు 1200 మంది క్షురకులను ఇంటిదొంగలుగా ఆరోపించి వారిపై బురదచల్లారని చెప్పారు. ఈ-వేలంలో కూడా అవకతవకలు జరిగినట్టు అవాస్తవ ప్రచారం చేశారని, ఏప్రిల్లో నిర్వహించే ఈ-వేలానికి ఈ ఆరోపణలు చేసిన మీడియా ప్రతినిధులు హాజరై తలనీలాలు ఎలా విక్రయిస్తారో, సిండికేట్కు, అక్రమాలకు అవకాశం ఉందేమో పరిశీలించుకోవచ్చన్నారు. ఇలాంటి చీప్ పాపులారిటీ కోసం నిజాయితీపరులైన అధికారులు, ఉద్యోగులపై బురదచల్లడం మంచిది కాదని హితవుపలికారు. రూ.18 లక్షలు విలువచేసే తుక్కు వెంట్రుకలను తిరుమల నుంచి 3 వేల కిలోమీటర్ల దూరంలోని మిజోరంకు ట్రక్కులో ఎవరైనా తరలిస్తారా? అని ప్రశ్నించారు.
తలనీలాల స్మగ్లింగ్ వ్యవహారంలో వాస్తవం ఇదే.. తప్పుడు ప్రచారం వద్దు
తలనీలాలు తరలిస్తూ సీజ్ చేసిన ట్రక్ మిజోరం రాష్ట్రానికి చెందినదని, ఆ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ స్థానికంగా సేకరించిన ప్రాసెస్ చేయని తలనీలాలను రవాణా చేయడానికి డ్రైవరుకు రూ.15 వేలు ఇచ్చినట్టు అధికారులు తమ రిపోర్టులో స్పష్టంగా పొందుపరిచారని ఆయన చెప్పారు. తలనీలాల అమ్మకం ద్వారావేంకటేశ్వరస్వామివారికి అధిక ఆదాయం తీసుకొచ్చేందుకు తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న ఉద్యోగులను కొందరు అవమానించడం, అభాండాలు వేయడం మంచిది కాదన్నారు. టిటిడిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు, మీడియా సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ధర్మారెడ్డి తెలిపారు. మిజోరంలో సీజ్ చేసిన తలనీలాలు టిటిడివేనని ఇప్పటికీ దుష్ప్రచారం చేయాలనుకునే మీడియా ప్రతినిధులు మిజోరంకు వెళ్లి విచారణ చేసి టిటిడి ప్రమేయం ఉన్నట్టు నిరూపిస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. కాగా, టీడీపీ నేతలు.. తలనీలాల స్మగ్లింగ్ అంటూ టీటీడీతోపాటు ఏపీ సర్కారుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.