కవితపై కేసు నమోదుకు ఆదేశం, మండిపడ్డ మోత్కుపల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పైన కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు మాదన్నపేట పోలీసులను ఆదేశించింది. కవిత పైన కేసు నమోదు చేసి విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించింది.
కాశ్మీర్, తెలంగాణల పైన కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేత కరుణసాగర్ ప్రయివేటు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. 11వ తేదీలోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పింది.
తెరాస ప్రభుత్వంపై మోత్కుపల్లి ఆగ్రహం
వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలంటూ రోడ్డెక్కిన రైతులపై లాఠీఛార్జి చేయడం బాధాకరమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సిం హులు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రైతులపై లాఠీఛార్జి జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.
తెలంగాణలో కరెంటు లేకుంటే వ్యవసాయం చేయడం కష్టమన్నారు. రైతులకు రోజుకు 9 గంటలు కరెంట్ ఇవ్వాల్సిందేనన్నారు. ఒకవేళ రైతులకు 9 గంటలకు కరెంట్ సరఫరా చేయలేకపోతే... కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగడంలో అర్థం లేదన్నారు. వ్యవసాయానికి సరిపడా కరెంట్ లేక వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కేసీఆర్ సొంత జిల్లాలో ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.