నారాయణకు కెసిఆర్ షాక్: తెరాసలోకి చంద్రావతి
హైదరాబాద్: పొత్తు పెట్టుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న సిపిఐ కార్యదర్సి కె. నారాయణకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు షాక్ ఇచ్చారు. సిపిఐ ఖమ్మం జిల్లా వైరా సిటింగ్ శాసనసభ్యురాలు చంద్రావతి శుక్రవారం కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు.
ఈసారి చంద్రావతికి వైరా టికెట్టు ఇవ్వొద్దని, ఆమెను పార్టీ సేవలకు వినియోగించుకోవాలని సిపిఐ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఆ మేరకు చంద్రావతికి పార్టీ స్పష్టత ఇచ్చింది. తనకు టికెట్ ఇవ్వకూడదనే నిర్ణయంపై చంద్రావతి మనస్తాపానికి గురయ్యారు. దాంతో ఆమె పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.

సిపిఐ సిటింగ్ స్థానాల్లోనూ తెరాస అధినేత కేసీఆర్ తన అభ్యర్థులను ప్రకటించడాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. తెరాస వైఖరిపై తెలంగాణ జేఏసీ, మేధావులు, వామపక్ష ప్రజాతంత్ర శక్తులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఒక జాతీయ పార్టీగా ఉండి కూడా రాష్ట్ర విభజనకు అనుకూలంగా సిపిఐ వ్యవహరించిందన్నారు. తెరాస రాజ్యసభ అభ్యర్థి కె కేశవరావుకు మద్దతు తెలిపి ఓట్లు వేసి గెలిపించామని గుర్తు చేశారు.
ఎన్నికల్లో తలోదారిన పోయి దూషణలకు దిగితే.. ప్రజలు చీదరించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విభజన తర్వాత ఎప్పటికప్పుడు తనతో ఫోన్లో మాట్లాడిన కెసిఆర్ ఎన్నికల అవగాహనపైన మాత్రం మాట్లాడట్లేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications