అవసరమైతే ఎల్ అండ్ టిని తప్పించండి: సచివాలయంపై ఏపీ ఆగ్రహం
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలోని విజిటింగ్ హాల్, సీఆర్డీఏ నిర్వహణ ఆఫీస్ పనులు సక్రమంగా పూర్తి కాకపోవడంపై సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్ అసహనం వ్యక్తం చేశారు.
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలోని విజిటింగ్ హాల్, సీఆర్డీఏ నిర్వహణ ఆఫీస్ పనులు సక్రమంగా పూర్తి కాకపోవడంపై సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్ అసహనం వ్యక్తం చేశారు.

ఎల్ అండ్ టికి నోటీసులు జారీ చేయండి
దీనిపై ఎల్ అండ్ టీ సంస్థకు నోటీసులు జారీ చేయాలన్నారు. అవసరమైతే పనుల నుంచి తప్పించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

ఇంటీరియర్స్ పైన అసహనం
ఈ సందర్భంగా నిర్మాణ తీరు, ఇంటీరీయర్స్ సరిగ్గా చేయకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నెలాఖరులోగా భవనాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్ది సందర్శకులకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకూ అనుకున్న రీతిలో పనులు పూర్తి చేయకపోవడంపై నిర్మాణ సంస్థకు నోటీసులివ్వాలన్నారు.

నీళ్లుండటంపై ఆగ్రహం
కేబుల్ ట్రెంచ్లో నీరు నిల్వ ఉండటాన్ని గమనించిన కమిషనర్ సచివాలయ నిర్వహణలో అశ్రద్ధ చూపిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. రోజూ ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు సచివాలయంలో పారిశుధ్ద్యం, పచ్చదనం పనులు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.

బస్సు షెల్టర్లు పూర్తి చేయాలని
సచివాలయంలో నూతనంగా నిర్మిస్తున్న బస్సు షెల్టర్లను నెలాఖరుకల్లా పూర్తి చేయాలని, ఎన్టీఆర్ క్యాంటిన్ను ప్రస్తుతం ఉన్నచోటు నుంచి సందర్శకుల మందిరం వెనుకకు మార్చాలని కమిషనర్ సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు.












Click it and Unblock the Notifications