బాబు ఇవ్వాల్సి ఉంది, టీడీపీ గొడవ అందుకే: కేసీఆర్
హైదరాబాద్: బడ్జెట్ పైన శుక్రవారం చర్చ ప్రారంభమైంది. టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశాక.. కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి చర్చను ప్రారంభించారు.
దురదృష్టకరం: జానా
టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి అన్నారు. తొలి సభలోని ఇది జరగడం పైన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము తెలుగుదేశం పార్టీతో జత కట్టామన్న మంత్రి ఈటెల రాజేందర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. తాము తెరాసతో జతకట్టాం కానీ, టీడీపీతో ఎప్పుడు జత కట్టలేదన్నారు.
మీరే గతంలో జత కట్టారన్నారు. మజ్లిస్ పార్టీ చెప్పినట్లుగా... సభలో ఎవరు డ్రామాలు ఆడుతున్నారో చెప్పాలని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా సభ్యులను సస్పెండ్ చేశామని, కానీ సభ్యులు గంటలకొద్ది అడ్డుకున్నప్పుడు మాత్రమే ఇలా చేశామని జానా చెప్పారు. టీడీపీ సభ్యులను తిరిగి వెనక్కి రప్పించి చర్చలో పాల్గొనేలా చేయాలన్నారు.
కృష్ణ పట్నం నుండి రావాల్సిన విద్యుత్ వాటా పైన చర్చించాలన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. విద్యుత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. కృష్ణ పట్నం నుండి తమకు 53 శాతం విద్యుత్ రావాలన్నారు.
జానాకు అక్బర్ కౌంటర్
అందరు కలిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని మజ్లిస్ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు.
మేం సిద్ధం: కేసీఆర్
రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలు.. వేటి పైన అయినా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. నలభై రోజులు అయినా, యాభై రోజులు అయినా చర్చకు సిద్ధమన్నారు. అన్ని అంశాల పైన తాము చర్చకు సిద్ధమని చెప్పాక అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. సభను అడ్డుకోవాలని టీడీపీ సభ్యులు ఓ ప్రోగ్రాం పెట్టుకొని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదటి రోజే సభ్యులను సస్పెండ్ చేయడం పైన జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, మరి మొదటి రోజే సభ్యులు ఇలా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తమకు సభ్యులను సస్పెండ్ చేయాలనే ఆలోచన లేదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా చేశామని వివరణ ఇచ్చారు.
ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుండి రావాల్సిన 1100 మెగావాట్ల విద్యుత్ విషయం బయటపడుతుందనే టీడీపీ సభ్యులు ఉద్దేశ్య పూర్వకంగా గొడవ చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎందుకు గొడవ చేస్తుందో తాము అర్థం చేసుకోలేమా అన్నారు. సభ్యులను సస్పెండ్ చేయడం తనకు బాధగానే ఉందన్నారు. కాగా, అనంతరం సభ పదిహేను నిమిషాలు వాయిదా పడింది.
తీసుకెళ్లిన మార్షల్స్
తెలంగాణ శాసనసభ నుంచి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. వీరందరినీ సభ నుంచి మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. సస్పెండైన టీడీపీ నేతలంతా అసెంబ్లీ మెట్ల మీద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.